బెల్లంపల్లిరూరల్, మే 23: బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడిలో అభివృద్ధి చేసిందేమీ లేదని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామంలో ప్రభుత్వం రూ. 1.20 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో మంజూరు చేసిన బీటీ రోడ్డు పనులకు ఆయన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్తో కలిసి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రభుత్వం రూ.96 కోట్లతో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చేసే పాదయాత్రలతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావన్నారు. గతంలో 66 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను ఎందుకు అభివృద్ధి చేయలేదని, గుడ్డి గాడిదల పళ్లు తోమారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల ఏలుబడిలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే బెల్లంపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకున్నదన్నారు.
గత ప్రభుత్వాల్లో మాదిరిగా గ్రామాల్లో మలేరియా జ్వరాలు లేవన్నారు. నియోజకవర్గంలోని బెల్లంపల్లి ప్రాంతంలో ఇప్పటికే వంద పడకల దవాఖాన నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకుందన్నారు. 3 వందల ఎకరాల్లో ఫుడ్ప్రాసెసింగ్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రధాన దృష్టి కేంద్రీకరించారన్నారు. మహారాష్ట్రలోని వార్దా నదిపై తెలంగాణ ప్రభుత్వం రూ.1500 కోట్ల నిధులతో బరాజ్ కట్టబోతున్నదన్నారు. తద్వారా బెల్లంపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు 20 టీఎంసీ ల నీటితో 55 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుటిల పన్నాగాల కోసం పొలిటికల్ టూరిస్టులు వచ్చి గోల్మాల్ మాటలు చెబితే ప్రజలు ఆగం కావద్దన్నారు. నాడు ప్రజలు పడిన మంచినీటి గోసను కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు తీర్చాయా ? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజల్లో ఉండి పని చేసే ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గారడి మాటలు చెబుతూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని ఎక్కడిక్కడ రైతులు తిప్పి కొట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, సర్పం చ్ రాజమౌళి, రైతు సంఘం నాయకులు సింగం గణేశ్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎం.రాజశేఖర్, ఎంపీటీసీ పీ సు భాష్రావు, సర్పంచులు వేముల కృష్ణమూర్తి, తాళ్లపల్లి అశోక్గౌడ్, గుర్రాల రాయమల్లు, కన్నెపల్లి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ , టీఆర్ఎస్ నాయకులు కొమ్మెర లక్ష్మణ్, రామగోని అశోక్గౌడ్, బొప్ప అర్జయ్య తదితరులున్నారు.
బెల్లంపల్లి టౌన్, మే 23 : నిరంతర సాధన, అధ్యయనంతో ప్రభుత్వ కొలువు సాధించవచ్చని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ మాట్లాడారు. ఆర్థిక స్థోమత లేని వారికి, ఆడపిల్లలను సుదూర ప్రాంతాలలో చదివించుకోలేని పరిస్థితుల్లో ఈ ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మొబైల్, ఇంటర్నెట్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్, వరంగల్ నగరాల కన్నా మెరుగ్గా ఇక్కడ సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉందని గుర్తు చేశారు. అపార విశ్వాసం, అనంత శక్తితో ముందడుగు వేస్తే విజయం తప్పక సాధించవచ్చని తెలిపారు. శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గ్రూప్ 1, 2,4, ఎస్సై,పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, నాయకులు గెల్లి రాజలింగు, గడ్డం భీమాగౌడ్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, మే 23: రాష్ట్రంలో సీఎం కేసీఆర్తోనే రవా ణా సౌకర్యం మెరుగుపడిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మండలంలోని కిష్టంపేట సమీపంలో ప్రధాన రహదారిపై నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. చెన్నూర్ నియోజక వర్గంలో రహదారుల నిర్మాణాలతో పాటు నూతన వంతెనల ఏర్పాటుకు సుమారుగా రూ.100 కోట్ల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి నూతన బ్రిడ్జికి రూ. 3.50 కోట్ల నిధులను మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు విప్ తెలిపారు. మండలంలోని సుద్దాల వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కిష్టంపేటలోని బ్రిడ్జిని త్వరలో ప్రారంభించనున్నట్లు సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చెఎస్ఐ వెంకట్, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.