కోటపల్లి, మే 21 : అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత జెండా రెపరెపలాడింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న తెలంగాణ క్రీడాకారులు మరోసారి ఫ్రాన్స్ వేదికగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఇటీవల ఇస్తాంబుల్లో నిజామాబాద్కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ పతకం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఊపు మరువకముందే తెలంగాణలోని మరో క్రీడాముత్యం అంతర్జాతీయ స్థాయి లో భారతదేశానికి పతకాన్ని అందించాడు. కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన రవి కిరణ్ పారిస్లోని నార్మడిలో జరుగుతున్న 19వ అంతర్జాతీయ స్కూల్ గేమ్స్లో పాల్గొని జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు.
కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన ఆసరెల్లి అమృత-లక్ష్మీనారాయణ కుమారుడైన ఆసరెల్లి రవి కిరణ్ పిన్నారం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. 6వ తరగతి నుంచి జైపూర్ గురుకులంలో చదువుతున్న రవి కుమార్.. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఒకేషనల్ (ఈటీ) ద్వితీయ సంవత్సరం. చిన్నప్పుడే పోలియో బారిన పడిన రవి కిరణ్కు ఆటలంటే అమితాసక్తి. క్రీడల్లో రాణిస్తున్న రవి కిరణ్ హైదరాబాద్లోని షేక్పేట స్పోర్ట్స్ అకాడమీలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 14 నుంచి ఫ్రాన్స్లో జరుగుతున్న వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నీకి అర్హత సాధించి భారతదేశం తరఫున జావెలిన్ త్రో విభాగంలో పోటీకి దిగాడు.
పతకమే లక్ష్యంగా ముందుకు సాగాడు. జావెలిన్త్రోలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా.. ఇదే టోర్నీలో ట్రిపుల్ జంప్లో బరిలో నిలిచిన కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్రణయ్ నాలుగో స్థానంతో కొద్దిలో పతకాన్ని కోల్పోయాడు. పతకం సాధించిన విద్యార్థి రవి కిరణ్ను సీఎం కేసీఆర్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, ఆదిలాబాద్ గురుకులాల ఆర్సీ స్వరూపా రాణి, కళాశాల ప్రిన్సిపాల్ బాల భాస్కర్, ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావ్, పీడీ జీ సంతోష్, పీఈటీ రాజలింగు అభినందించారు.