భారతదేశ చర్రితలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 80,039 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే గ్రూప్-1, ఎస్సై, పోలీసు, రవాణ, ఫైర్ శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఒకవైపు జాబ్స్కు దరఖాస్తులు ఆహ్వానిస్తూనే.. మరోవైపు బీసీ స్టడీ సర్కిల్స్లో ఉచితంగా శిక్షణ కూడా ఇప్పిస్తున్నది.
దీనికితోడు ఉపకార వేతనంగా గ్రూప్-1 అభ్యర్థులకు రూ.5 వేలు, పోలీసు ఉద్యోగార్థులకు రూ.2 వేలు ఇస్తున్నారు. కాగా.. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో 400 మంది తర్ఫీదు తీసుకుంటున్నారు. వీరికి వాట్సాప్ గ్రూపుల్లో విద్య, ఉద్యోగ సమాచారం ఇవ్వడంతోపాటు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు.
ఆదిలాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన 400 మంది ఉద్యోగార్థులు శిక్షణ పొందుతున్నారు. గ్రూప్-1 వంద మంది.. ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 300 మంది కోచింగ్ తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిపుణులైన అధ్యాపకులతో తర్ఫీదు ఇస్తున్నారు. గ్రూప్-1 ఉద్యోగార్థులకు మూడు నెలలు.. ఎస్సై, పోలీసు అభ్యర్థులకు 75 రోజుల శిక్షణ ఉంటుంది.
లైబ్రరీలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా చదువుకొనే అవకాశం కల్పించారు. వాట్సాప్ గ్రూపుల్లో విద్య, ఉద్యోగ సమాచారం అందిస్తారు. శిక్షణ పొందుతున్న వారికి ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడంతో వారి ఖర్చులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నది.
గ్రూప్-1 ఉద్యోగార్థులకు నెలకు రూ.5 వేలు.. ఎస్సై, పోలీసు శిక్షణ పొందుతున్న వారికి నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్షిప్ ప్రభుత్వం ఇస్తున్నది. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు లేకుండా ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వం తమకు అందిస్తున్న సాయంపై నిరుద్యోగుల్లో ఉద్యోగం సాధిస్తామనే భరోసా ఏర్పడింది.
ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతోపాటు యువతీ, యువకులకు నెలకు రూ.5 వేల స్కాలర్షిప్ ఇవ్వడం గతంలో ఎప్పడూ లేదు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే శిక్షణ తీసుకునేందుకు పట్టణాలకు వస్తారు. వారికి వివిధ ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వం నెలకు రూ.5 వేలు ఇస్తుండడంతో ఎలాంటి సమస్య ఉండదు. స్కాలర్షిప్ ఇవ్వడం పేద కుటుంబాల నిరుద్యోగులకు వరం వంటింది. నేను గ్రూప్-1 ఉద్యోగానికి శిక్షణ తీసుకుంటున్నా. క్లాసులు బాగా చెబుతున్నారు. ఉచితంగా భోజనం వసతి ఏర్పాటు చేశారు.
– సంగర్తి భూమేశ్, గ్రూప్-1 అభ్యర్థి, సుర్జాపూర్, ఖానాపూర్ మండలం, నిర్మల్
ప్రభుత్వం వెలువరించే ఉద్యోగాల కోసం శిక్షణ కావాల్సిన వారు బీసీ స్టడీ సర్కిల్లో సంప్రందించాలి. 08732-221280 నంబరుకు ఫోన్ చేసినా అవకాశం కల్పిస్తాం. వీరికి క్రాస్ కోర్స్ ఏర్పాటు చేస్తాం. గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 400 మందికి శిక్షణ ఇస్తున్నాం. మరో 50 మందికి చదువుకునే అవకాశం కల్పించాం. అభ్యర్థులకు లైబ్రరీ, స్టడీ హాల్ అందుబాటులో ఉంచాం. పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం సౌకర్యం కల్పిస్తున్నాం. నిపుణులైన వారితో తరగతులు ఏర్పాటు చేయడంతో పాటు వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల ద్వారా ఈ- స్టడీ మెటీరియల్ అందిస్తాం.
– ప్రవీణ్కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్, ఆదిలాబాద్
ప్రభుత్వం 80,039 ఉద్యోగాల ప్రకటన చేయడంతోపాటు పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వడం గొప్ప విషయం. కష్టపడి చదివితే గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు. గతంలో ఉద్యోగాల సాధించడానికి నిరుద్యోగులు హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయి కోచింగ్ తీసుకునే వారు. ఇందుకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం స్టడీ సర్కిళ్ల ద్వారా వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నది. దీంతో ప్రతి విద్యార్థికి రూ.50 వేల వరకు ఖర్చు తగ్గింది. నేను గ్రూప్-1 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా. ఇక్కడ శిక్షణ కార్పొరేట్ స్థాయిలో ఉంది.
– సాయిని గోవర్ధన్, మాదాపూర్, ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్
నేను డిగ్రీ పూర్తి చేశా. కానిస్టేబుల్ ఉద్యోగానికి శిక్షణ తీసుకుంటున్నా. పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు సర్కారు కొలువులు సాధించడానికి ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తున్నది. ప్రైవేటులో శిక్షణ తీసుకోలేని మా వంటి వాళ్లకు బీసీ స్టడీ సర్కిల్ వరం వంటిది. నిపుణులైన అధ్యాపకులు బోధించడంతో పూర్తిస్థాయిలో వివిధ సబ్జెక్టులపై పట్టు సాధిస్తున్నా. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధిస్తా.
– ఏ సంధ్య, పోలీసు అభ్యర్థి, బోథ్ మండలం, ఆదిలాబాద్
పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో అన్ని సౌకర్యాలు కల్పించిన్రు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు చెబుతున్నరు. లైబ్రరీలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చదువుకునే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాయడానికి అవసరమైన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజన వసతి, మంచినీరు, ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన్రు. ప్రభుత్వం వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు పేద విద్యార్థులు సర్కారు కొలువులు సాధించేలా ఉచితంగా కోచింగ్ ఇవ్వడం సంతోషంగా ఉంది. బాగా చదువుకొని ఉద్యోగం సాధిస్తా.
– బీ ప్రియాంక, గ్రూప్-1 అభ్యర్థి, మహాలక్ష్మీవాడ
రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. ఇప్పటికే పలు నోటిఫికేషన్స్ జారీ చేసింది. నేను బీసీ స్టడీ సర్కిల్లో ఎస్సై ఉద్యోగానికి శిక్షణ తీసుకుంటున్నా. వివిధ అంశాలపై నిపుణులైన ఫ్యాకల్టీలతో శిక్షణ ఇప్పిస్తున్నా. అన్ని విషయాలను బాగా చెబుతున్నారు. ఖర్చులకు గానూ ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తున్నది.
– తాగిరే రాంగోపాల్,ఎస్సై అభ్యర్థి, బోథ్, ఆదిలాబాద్
నేను బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన. గ్రూప్-1కు ప్రిపేరవుతున్న. ఇప్పటికే దరఖాస్తు చేసిన. పట్టుదలతో సదువుతున్న. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ గురించి తెలుసుకొని జాయినయ్యా. ఇక్కడ చేరాకే ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. నిపుణలతో వివిధ అంశాలను చక్కగా బోధిస్తున్నరు. పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ రీజనింగ్ తోపాటు ఇతర విషయాలను చక్కగా చెబుతున్నరు. రోజూ పరీక్షలు నిర్వహించడంతో పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న. ఏమైనా డౌట్స్ అడిగితే అర్థమయ్యేలా వివరిస్తున్నరు. శిక్షణతో పాటు డబ్బులు ఇస్తున్నరు.
– కదం సునీత, గ్రూప్-1 అభ్యర్థి, మన్నూర్, గుడిహత్నూర్