నార్నూర్, మే 19 : ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చిత్తగూడ గ్రామంలో తొడసం వంశస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెర్సాపేన్ పూజలు గురువారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరుకాగా ఆదివాసులు ఘన స్వాగతం పలికారు. ఆయనను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే పెర్సాపేన్కు ప్రత్యేక పూజలు చేశారు. మందిర నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండారీ ఉత్సవాలు, పెర్సాపేన్ మందిర నిర్మాణానికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. షెడ్డు, వంటశాల నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ తొడసం నాగోరావ్, సర్పంచ్ మడావి కైలేశ్వరీసాగర్, తొడసం బాపురావ్, రాజుపటేల్, యాదవ్రావ్, గోపాల్, బండు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓటేగాడ్ గ్రామంలో ఆదివాసులు పూర్కపరివార్ పెర్సాపేన్కు సంప్రదాయ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో ఆదివాసులు తరలివచ్చారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్క బాపురావ్, చిత్రు, హన్మంతు, మానిక్రావ్, యాదవ్రావ్, మాధవ్ పాల్గొన్నారు.