కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై రైతన్నలు మండిపడుతున్నారు. తెలంగాణలో యాసంగి వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రం నిరాకరించగా.. రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. కాగా.. కేంద్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల ధరలు అడ్డగోలుగా పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానకాలంలో పత్తి అధికంగా సాగవుతున్నది. గతేడాది ధర రికార్డుస్థాయిలో పలుకడంతో విస్తీర్ణం పెరుగనుంది.
కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా విత్తనాల ధరలు భారీగా పెరిగాయి. గతేడాది సంచికి రూ.767 ఉండగా..
ఈ సీజన్లో రూ.43 పెరిగి రూ.810కి చేరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో 11.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశాలు ఉండగా.. రైతులపై రూ.10 కోట్ల భారం పడనుంది.
ఆదిలాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పత్తి అధికంగా సాగవుతుంది. గతేడాది 10.35 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాలు, నిర్మల్లో 1.80 లక్షలు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 2.95 లక్షలు, మంచిర్యాలలో 1.60 లక్షల ఎకరాల్లో వేశారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.6,025 మద్దతు ధర ప్రకటించగా.. సీజన్ ప్రారంభం నుంచి క్వింటాలుకు రూ.8 వేలు చెల్లించి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లకు ధర అధికంగా ఉండడంతో క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత నెలలో నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డులో రూ.12 వేలు చెల్లించగా.. వరంగల్ మార్కెట్లో రూ.14వేలు పలుకుతున్నది. పత్తికి మంచి ధర రావడంతో ఈ యేడాది వానకాలంలో తెల్లబంగారం సాగు విస్తీర్ణంలో 11.50 లక్షల ఎకరాల వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీటీ-2 రకం విత్తనాలు వేస్తారు. విత్తనాల సంచి 470 గ్రాములుంటుంది. ఇందులో 450 గ్రాముల బీటీ-2 విత్తనాలు, 20 గ్రాముల నాన్బీటీ విత్తనాలుంటాయి. గతేడాది పత్తి విత్తనాల సంచి ధర రూ.767 ఉండగా.. ఈ సారి రూ.810కి పెరిగింది. అంటే రూ.43 అధికం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతరేక విధానాలతో సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు సీజన్ ప్రారంభంలో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. పత్తి విత్తనాల కంపెనీల తయారీదారులు పెరిగిన పెట్రోల్, డీజిల్, ఇతర ముడి సరుకుల ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటి ధరలు పెరగడంతో కంపెనీలు విత్తనాల ధరను పెంచాయని అధికారులు తెలిపారు.
బీటీ-2 పత్తి విత్తనాలు తయారు చేసే కంపెనీలు వందల సంఖ్యలో ఉండగా.. రైతులు మాత్రం తమకు నచ్చిన కొన్ని కంపెనీల విత్తనాలను మాత్రమే కొనుగోలు చేస్తారు. డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలను వ్యాపారులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తారు. గతేడాది జిల్లాలో పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో ఈ సారి రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయనున్నారు.
రైతులు ఎకరం పంట వేయడానికి 470 గ్రాముల రెండు బ్యాగుల విత్తనాలను వాడుతారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23 లక్షల సంచులు అవసరవుతాయి. ఒక్కో సంచిపై రూ.43 ధర పెంచడంతో రైతులపై రూ.10 కోట్ల విత్తన భారం పడనుంది. విత్తనాల కంపెనీల ధరలను నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే పత్తి విత్తనాల ధరలు పెరుగుతున్నాయని రైతులు అంటున్నారు.