మంచిర్యాల ఏసీసీ, మే 18 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల గర్భిణులు, చిన్నారులు మతా శిశు సంరక్షణ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్రోడ్డులో ఏర్పాటు చేసిన మాతా శిశు కేంద్రంలో ఓపీ వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని తెలిపారు.
కార్పొరేట్ స్థాయిలో అధునాతనమైన పరికరాలు, వసతులతో కూడిన సౌకర్యాలను ఎంసీహెచ్ దవాఖానలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఫార్మసీ, ల్యాబ్, ఐసీయూ, శిశువుల ఇంక్యూబెటర్, ఆపరేషన్ గదులను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దవాఖానలో ఉమ్మివేయకుండా చూడాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. గర్భిణులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ అరవింద్, మంచిర్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ దావుద్ సులేమాన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి పడాల రవీందర్, ఎంసీహెచ్ ఇన్చార్జిలు డాక్టర్ వేదవ్యాస్, డా.వనిత, పిల్లల వైద్య నిపుణురాలు నాగవేణి, కౌన్సిలర్లు, నాయకులు, దవాఖాన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల నలు మూలల నుంచి వచ్చే గర్భిణుల కోసం ప్రత్యేకమైన బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మంచిర్యాల డీఎం రవీంద్రనాథ్తో ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. కాలేజ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎంసీహెచ్ దవాఖానకు ఆటోల వస్తున్న గర్భిణులను గమనించిన ఎమ్మెల్యే వారితో ఎంత చార్జి తీసుకుంటున్నారు అని అడిగారు. రూ.100 తీసుకుంటున్నారని వారు తెలిపారు.
వెంటనే మంచిర్యాల ఆర్టీసీ డీఎం ను ఎంసీహెచ్ దవాఖానకు పిలిచి మాట్లాడారు. తక్కువ చార్జిలతో కూడిన బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. మంచిర్యాల బస్ స్టాండ్, ఐబీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డీఎంను కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని తెలిపారు.