సీ‘మంట’ రాజుకుంది. సీసీఐ యంత్ర సామగ్రిని తుక్కు కింద అమ్మాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్ర సర్కారు పునఃప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుంటే.. ప్రైవేటీకరణలో భాగంగా మోదీ సర్కారు అమ్మాలని చూడడంపై ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం పంజాబ్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. అలాగే జైనథ్ మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీ డౌన్ డౌన్.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐని తెరువకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
– ఎదులాపురం/ఆదిలాబాద్ రూరల్/జైనథ్, మే 18
‘కేంద్ర మంత్రి పీయూష్జీ, భారత ప్రభుత్వం సీసీఐ పరిశ్రమ యంత్రాల తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి, పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. యువతకు ఉపాధి కల్పించే ఈ పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తాం’
– ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిశ్రమ యంత్ర సామగ్రిని తుక్కు కింద ఈ-వేలం వేయడంపై నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. మొదటి రోజైన మంగళవారం సీసీఐ సాధన కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ, ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలు దహనం చేశారు. రెండో రోజైన బుధవారం కూడా ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పంజాబ్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. నరేంద్ర మోదీ డౌన్ డౌన్.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నినదించారు. అలాగే జైనథ్ మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై టీఆర్ఎస్ నాయకులు ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్ జైనథ్ మండల కన్వీనర్ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొని మాట్లాడారు.
– ఎదులాపురం/ఆదిలాబాద్ రూరల్/జైనథ్, మే 18
సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ప్రయత్నాలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అమ్మేస్తున్నది. కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజ్ఞప్తులు, లేఖలు రాసినా పట్టించుకోకుండా తుక్కు కింద అమ్మేయాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. సీసీఐని మూసేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ఐదు వేల మంది ఉపాధి కొల్పోతారు. మంచి భూమి, రహదారులు, లైమ్స్టోన్ నిల్వల వంటి వనరులు పుష్కలంగా ఉన్నా తుక్కు కింద వేలం వేసే నిర్ణయం అన్యాయం. ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా బిడ్లను ఆహ్వానించడం, టెండర్లను స్వీకరించడం వంటి పనులు చకచకా చేయడాన్ని తప్పు పడుతున్నాం. రాష్ట్ర బీజేపీ నాయకులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసినా చలనం లేదు. ఒక్కొక్కటిగా అన్నింటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నది. సిమెంట్ పరిశ్రమను తుక్కు కింద వేసిన గతే బీజేపీ ప్రభుత్వానికి పడుతుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తుక్కు చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్ష, కార్యదర్శులు అజయ్, అష్రఫ్, సలీం పాషా, ఫ్లోర్లీడర్ బండారి సతీశ్, అశోక్స్వామి, సంద నర్సింగ్, కొండ గణేశ్, పండ్ల శ్రీనివాస్, సంజయ్, దమ్మపాల్, రామ్కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ జైనథ్ నిరసన కార్యక్రమంలో ఎంపీపీపీ మార్శెట్టి గోవర్ధన్, జనరల్ సెక్రటరీ గణేశ్ యాదవ్, సర్పంచ్ దేవన్న, నాయకులు గడ్డం జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు.
నేను సీసీఐల ప్యాకింగ్ సెక్షన్ల కార్మికుడిగా పనిజేసిన. నెలకు రూ.5 వేలు ఇచ్చేటోళ్లు. నాకు ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. ఎప్పుడైతే సీసీఐ బందు వడ్డదో అప్పట్నించీ ఇగో ఇద్వారిదాకా మాకు జిందగీ అనేటిది ఎట్లనో ఏమో అని అనిపిస్తున్నది. అట్ల సీసీఐ మూతవడుడుతోని బతుకు గాడి తప్పింది. పొలగండ్లను మంచిగ సదివించలేక పోయినం. ఒగ పండుగ మంచిగనా.. పబ్బము మంచిగనా, ఏదో బతుకుతున్నమా అంటే బతుకు తున్నం అన్నట్లుగ ఉన్నది. ఇగ కుటుంబమంతా కూలీనాలీ చేసుకుంటున్నం. బాకీలు చేసి పొల్ల లగ్గం చేసిన. నెలకు రూ.1,000 పింఛన్ తప్ప, సీసీఐ నుంచి ఇంకేమీ అందడంలేదు. ఎన్నటికైనా సీసీఐని తెరవకపోతరా.. అని అనుకున్నం. గనీ ఇగ సెంటరోల్లు దానికి టెండరు పిలుస్తున్నరట. సీసీఐల ఉన్న మిషనరీ అమ్ముతరట. ఇప్పుడు మాకు ఆఖరి ఆశ సచ్చిపోయింది. నాడు ఒగ వెలుగు వెలిగిన సీసీఐ వేల మంది గరీబు, సరీబుకు తిండి వెట్టింది. అది మూతవడి ఎన్నో బతుకులు చీకటైనయ్. సెంటరోళ్లు ఇట్ల ప్రైవేటు ఆలోచన ఎన్కకు తీసుకోకుంటే ఇగ ఉద్యమం సురూజేస్తం. మాకొసానకు గీ విషయంల కొట్లాడుతున్న సీసీఐ సాధన కమిటీ, టీఆర్ఎస్తోని ఉండుకుంట మా కోరికలు బలంగ ఇనిపిస్తం.
– నలగంటి సంటెన్న, సీసీఐలో మాజీ ప్యాకింగ్ ఉద్యోగి, ఆదిలాబాద్
నా పేరు జల్వా గైక్వాడ్. నేను ఆదిలాబాద్లోనే ఉంట. సిమెంట్ కంపెనీలో మెకానిక్గా పనిజేసేది. నెలకు రూ.8వేలు వస్తుండే. వచ్చే డబ్బులతోనే రందీ లేకుండా నేను, నా కుటుంబం బతికేది. కంపెనీ మూసేసిన తర్వాత వీఆర్ఎస్ తీసుకుంటే రూ.3 లక్షలు వచ్చినయ్. ఈ డబ్బులతోనే ఇద్దరు కొడుకులు వ్యాపారం చేస్తున్నరు. నా బిడ్డకు అప్పుజేసి లగ్గం జేసిన. మేము సీసీఐ గోడ పక్కనే ఉంటం. పొద్దున లేవంగనే బందైన పరిశ్రమ కనిపిస్తది. మస్తు బాధనిపిస్తది. కేంద్ర ప్రభుత్వం తుక్కు కింద అమ్మడాన్ని వాపసు తీసుకోవాలి. లేకుంటే నిరాహార దీక్షలు చేస్తం.
మేమంతా ఏండ్లకింద ఈ సీసీఐని నమ్ముకొని ఆదిలాబాద్కు వచ్చినం. రెక్కాడితేగానీ డొక్కాడని జీవులం. ఇక్కడ మిషన్ హెల్పర్గా పనిచేసిన. సీసీఐ మూతవడ్డంక ఏమి చేయాలో అర్థం కాలే. అటు మా రాష్ర్టానికి పోలేం. ఈడా ఉండలేమన్నట్లు ఉంది పరిస్థితి. నాకు సంబంధించిన పెండింగ్ రూ. 5 లక్షలు డబ్బులు కూడా రాలేదు. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. కొడుకులు మేస్త్రీ పనిల ఉన్నరు. ఈ వృద్ధాప్యంలో నాకు, నా భార్యకు కొడుకుల కూలే ఆధారం. ఇపుడు సీసీఐ యంత్ర సామగ్రిని టెండరిచ్చుడు అన్యాయం. ఇప్పుడు కేంద్రం అందరి కడుపు కొట్టింది. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న వారికి నిరాశను మిగిల్చింది.
– చైత్రామ యాదవ్, వలస కార్మికుడు
సీసీఐల మిషన్ ఆపరేటర్గా పనిచేసేటొన్ని. నెలకు ఎనిమిది వేల రూపాలు ఇస్తుండే. బతుకు మంచిగ సాగుతుండె. ఉన్నట్టుండి సీసీఐ తలుపులు మూసేసిన్రు. నేను పదేండ్లు ఒక దుకాండ్ల పనిచేసిన. ఇపుడు 13 ఏండ్ల సంది సిమెంటు ధర్వాజలు, కిటికీల దుకాండ్ల పనిచేస్తున్న. తెలంగాణ సర్కారు వచ్చినంక నా భార్యకు ఆశ కార్యకర్తగా అవకాశమచ్చింది. మాకు ఇద్దకు కూతుళ్లు. అందులో ఓ బిడ్డకు బుద్దిమాంద్యముంది. ఈ పరిస్థితిల మా కష్టం పెద్దదే. సిమెంటు కార్పొరేషన్ల దర్జాగా పనిచేసిన నాకు సిమెంటు కిటికీల దుకాండ్ల పనిచేసే పరిస్థితి వచ్చింది. ఇట్ల నా తోటి కుటుంబాల బతుకులను చూస్తే కూడా దుఖఃమస్తది. మోడీ సర్కారు రైతులు, కార్మికుల మీదనే కక్ష కట్టింది. పెట్టుబడి దార్లకు న్యాయం చేసి, సామాన్యుల పొట్ట కొట్టింది. టీఆర్ఎస్తోని కలిసి ఉద్యమానికి సిద్ధమవుతం.
– రెడ్డి లస్మారావు , సీసీఐ పూర్వ మిషన్
నేను సీసీఐల సివిల్ సైప్లె విభాగంల పనిచేస్తుంటిని. నా భర్త కూడా కార్మికుడిగా పని చేస్తుండే. ఇద్దరి జీతం రూ.8 వేల వరకు వచ్చేది. ఇగ సీసీఐ ఎప్పుడైతే బందయ్యిందో గప్పటి నుంచి మాకు బతుకు భారమైంది. నా భర్త ఇప్పుడు కూలీ పనులు చేస్తున్నడు. ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. పెళ్లిళ్లను అప్పులు చేసి చేపించినం. కొడుకు,నా భర్త పనులకు పోతనే ఇల్లు గడుస్తున్నది. ఒకప్పుడు మా సీసీఐ ఏరియాల కార్మికుల వాడల్లో కళ ఉండేది. ఇప్పుడు సెంటరోళ్లు సీసీఐని ప్రైవేటోళ్ల చేతుల్ల వెడ్తున్నరని తెలసి అంతా ఏడ్చినం. సీసీఐ మా బతుకులను నడమంత్రం చేసింది. కేంద్రమోళ్లకు కార్మికుల మీద ఇంత కక్ష ఎందుకో అర్థమవట్లే. వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలే.
– మనుతాయి , సివిల్ సప్లయి విభాగం , ఆదిలాబాద్
నా భర్త అశోక్ సీసీఐలో కార్మికుడిగా పనిచేస్తుండే. 2015లో చనిపోయిండు. ఇటు సీసీఐ మూతపడి, అటు భర్త చనిపోయి నానా కష్టాలు పడ్డ. నాకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కూలి పనులకు పోయిన. సీసీఐ తెర్వాలని కేసీఆర్ సారు, సాధన సమితి నాయకులు ఎంతో కొట్లాడిన్రు. ఎప్పటికైనా తెరుస్తరనే నమ్మకం ఉండే. ఈ కేంద్రమోళ్లు గిట్ల జేస్తరని అనుకోలే. సీసీఐని ప్రైవేటోల్లకు ఇయ్యడం సరికాదు. కార్మిక కుటుంబా లన్నీ బీజేపోళ్లపై నారాజు అయితున్నయ్. న్యాయం చెయ్యకపోతే అందరం కలిసి పోరాటం జేస్తం.
– రత్నప్రభ బిజారే, ఆదిలాబాద్
నన్ను పోతరాజు భూమక్క అంటరు. గీ సిమెంట్ కార్ఖానా పక్కనే ఉంట. గిందులోనే నా పెనిమిటి భూమన్న ప్యాకింగ్ జేస్తే.. నేను కూలీ పనిజేసేది. అచ్చే పైసలతోనే బతికేది. మాకు ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. మా ఆయన ఐదేండ్ల కింద కాలం జేసిండు. గింతలోనే కార్ఖాన మూసేసిండ్రు. ఏం జేయాల్నో సమజుకాలె. ఏ పని దొరికితే ఆ పని పనిజేసుకుంటు పిల్లల్ని సాకిన. ఎప్పటికైనా సీసీఐ తెరుస్తరని ఆశుండె. నా కొడుకులకైనా పని దొరుకుతదనుకున్న. గిప్పుడేమో సామాన్లు అమ్మమని బీజేపోళ్లు చెప్పవట్టే. ఇదేక్కడి న్యాయం. తెలంగాణ సర్కారోళ్లు తెరుస్తమని జెప్తుంటే.. కేంద్రమొళ్లు అమ్మవట్టే. బీజేపోళ్లు మా వద్దకు మల్ల ఎట్లత్తరు. అత్తే తగిన బుద్ధి చెబుతం.