తెలంగాణ సర్కారు ప్రజా సంక్షేమ పథకాలను గడప గడపకూ చేరవేస్తున్నది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రగతి ఫలాలు అందిస్తున్నది. ఒక్కో కుటుంబం రెండు నుంచి ఆరు పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, దళితబస్తీ, దళితబంధు, ఉచిత కరంటు, పింఛన్ వంటి పథకాలు పొందుతూ లక్షాధికారులు అవుతున్నారు. పథకాల అమలు పార్టీలకు అతీతంగా కొనసాగుతున్నది. సబ్బండ వర్గాలతోపాటు బీజేపీ నాయకులు కూడా ప్రయోజనం పొందుతున్నారు. రైతుబంధు ద్వారా లబ్ధి పొందుతూ యేటా లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ చాలా పథకాలు అమలు చేస్తున్నదని, ప్రయోజనకరంగా ఉన్నాయని జిల్లా పరిషత్, మండల, ఇతర సమావేశాల్లో కమలం పార్టీ నాయకులు కొనియాడడం కొసమెరుపు.
ఆదిలాబాద్, మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు తీసుకోవాలంటే పైరవీలు, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. గత ప్రభుత్వం అమలు చేసిన అరకొర పథకాలు అర్హులకు అందేవి కావు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పార్టీకి చెందిన వారికే సర్కారు సాయం వచ్చేలా చూసేవారు. దీంతో రైతులు, పేదలు, ఇతర వర్గాల ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం పథకాలను నోచుకోలేక పోయారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇంటింటికీ కనీసం రెండు నుంచి ఆరు పథకాలను తీసుకుంటూ లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. కడుపులో ఉన్న శిశువు మొదలుకొని మంచాన పడిన వృద్ధులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతున్నారు. పథకాల అమలులో ఆన్లైన్ విధానం అమలు చేయడం, పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించడంతో అర్హులందరూ సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్నారు.
ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు అనే తేడా లేకుండా అర్హులు సర్కారు పథకాలను అందుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాల్లో కాంగ్రెస్ శ్రేణులు లబ్ధిదారులుగా ఉన్నారు. సర్కారు అమలు చేస్తున్న పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పథకాలను ప్రశంసిస్తున్నారు. జిల్లా పరిషత్, మండల సమావేశాలు, ఇతర మీటింగ్లలో పథకాలను కొనియాడుతున్నారు. ప్రభుత్వ పథకాలను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.
లక్ష్మణచాంద, మే 16 : మాది నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని చామన్పెల్లి గ్రామం. నాకు పావు తక్కువ ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతిసారి రూ.23,750 చొప్పున రైతుబంధు సాయం తెలంగాణ సర్కారు అందిస్తున్నది. యేడాదికి రెండు విడుతలుగా రూ.47,500 వస్తున్నాయి. యాసంగి, వానకాలానికి ముందు డబ్బులు ఖాతాల్లో జమ చేయడంతో పెట్టుబడికి ఉపయోగపడుతున్నాయి. విత్తనాలు, ఎరువులకు ఢోకా లేకుండా పోతున్నది.
– సొక్కాల బాపయ్య, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ జిల్లా.
దహెగాం, మే 16 : మాకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కోచవెల్లిలో ఎనిమిదెకరాల ఎవుసం ఉంది. తెలంగాణ సర్కారుకు ముందు పెట్టు బడికి సాన గోస పడేది. కేసీఆర్ సీఎం అయ్యాక రైతుల ను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి పెట్టుబడి సా యం అందిస్తున్నారు. యేడాదికి రెండు విడుతలుగా అందిస్తుండగా.. ఒక్కో విడుతకు రూ.40వేల చొప్పున వస్తున్నాయి. ఇప్పటి వర కు ఎనిమిది విడుతలుగా రూ.6 లక్షలకుపైగా డబ్బులు తీసుకున్నా. ఇప్పుడైతే వ్యవసాయం పండుగలా ఉంది. – గౌరె రాకేశ్, ఎంపీటీసీ, కొచవెల్లి, బీజేపీ నాయకుడు.
దహెగాం, మే 16 : నాతోపాటు మా కుటుంబ సభ్యులకు 12 ఎకరాల భూమి ఉంది. ఒక్కో విడుతకు రూ.60వేలు వస్తాయి. రెండు విడుతలకు కలిపి రూ.1.20 లక్షలు వస్తున్నాయి. వీటితో ఎవుసం ఖర్చులు వెళ్లిపోతున్నాయి. సమయానికి డబ్బులు పడుతుండడంతో సావుకార్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుడు బాధ తప్పింది.
– బొర్కుట్ మల్లేశ్, బీజేపీ నాయకుడు, దహెగాం
రైతబంధు కింద రూ.4 లక్షలకుపైగా వచ్చాయి..
దస్తురాబాద్, మే 16 : నాకు దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడలో ఐదున్న రెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తి, కంది, సోయా వేస్తాను. నాకు యేడాదికి రెండు విడుతలుగా పెట్టుబడి ఖర్చు కింద రైతుబంధు డబ్బులు వస్తున్నాయి. యేడాదికి రూ.54 వేల చొప్పున తెలంగాణ సర్కారు నా ఖాతాలో జమ చేస్తున్నది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు అంటే దాదాపుగా రూ.4 లక్షలకుపైగా డబ్బులు వచ్చాయి. నాకు గీత, శ్వేత ఇద్దరు కూతుర్లు. ఇద్దరికి పెండ్లి చేస్తే కల్యాణలక్ష్మి కింద రూ.1,75,116 వచ్చాయి. 2017లో మొదటి కూతురు వివాహం చేసినపుడు రూ.75 వేలు, 2018లో రెండో కూతురు వివాహానికి రూ.1,00,116 వచ్చాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే లబ్ధి చేకూరింది. టీఆర్ఎస్ సర్కారు లేకుంటే ఈ డబ్బులు వచ్చేవి కాదు.
– బంగారి కిషన్, బీజేపీ నాయకుడు (ఆదిలాబాద్ జిల్లా)
టీఆర్ఎస్ పాలనలో..
ఉద్యమ నాయకుడిగా రాష్ట్రం సాధించి.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారు. వందల సంఖ్యలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సబ్బండ వర్గాల మెప్పు పొందుతున్నారు. రైతును రాజును చేయడానికి రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు వంటి పథకాలు ప్రవేశపెట్టారు. వైద్యం అందిస్తూ ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తున్నారు. కడుపులో ఉన్న శిశువు మొదలుకొని మంచాన పడ్డ వృద్ధుల వరకు పథకాలు పొందుతూ సుఖమయ జీవనం సాగిస్తున్నారు.