ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం నష్టాన్ని మిగిల్చింది. నిర్మల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. ఆయా చోట్ల పంటలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంది. వరి, మక్క, నువ్వులు, మామిడి, తదితర పంటలకు నష్టం వాటిల్లగా, పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు నష్టం అంచనా వేసే పనిలో నిమగ్నమవగా, బాధితులను అదుకుంటామని ప్రజాప్రతినిధులు, నాయకులు భరోసానిచ్చారు.
దస్తురాబాద్/పెంబి/కడెం/ఖానాపూర్ టౌన్/ఖానాపూర్ రూరల్/ముథోల్ /బేల/ ఉట్నూర్ రూరల్, మే 16: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన గాలివాన ఆయా ప్రాంతాల్లో నష్టాన్ని మిగిల్చింది. పంటలతో పాటు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా గ్రామాల్లో వరి, నువ్వులు, మక్క, తదితర పంటలకు నష్టం వాటిల్లింది. పెంబి మండలంలోని పెంబి, మందపల్లి, నాగాపూర్ గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన మక్క, ధాన్యం తడిసిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోగా, ఏఈ సాయికుమార్, సిబ్బందితో కలిసి పునరుద్ధరించారు. దస్తురాబాద్ మండలం దేవునిగూడెంలోని తోటల్లో మామడి కాయలు రాలిపోయాయి.
సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. రేవోజిపేట గ్రామంలో రోడ్లుపై భారీ వృక్షం పడడంతో, జేసీబీ సహాయంతో తొలగించారు. మున్యాలలో విద్యుత్ తీగలపై నీలగిరి కొమ్మలు పడడంతో సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో వాటిని తొలగించారు. దేవునిగూడెం గ్రామంతో పాటు పలు గ్రామాల్లో పంట నష్టాన్ని ఏఈవో తిరుపతి రైతులతో కలిసి పరిశీలించారు. సుమారు 260 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. ఆయనతో పాటు సర్పంచ్ ముష్కే అంజన్న, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎండపెల్లి గంగన్న, రైతులు తదితరులున్నారు. ఖానాపూర్ మండలంలో ఈదురుగాలుల ధాటికి సుభాష్నగర్, ఇంద్రానగర్, పద్మావతినగర్లో పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి.
సింగాపూర్ గ్రామంలో బిల్ల మంగమ్మ ఇంటి పైకప్పు ఎగిరిపడింది. అలకుంట వెంకటేశ్ కొత్తగా నిర్మిస్తున్న ఇంటి గోడలు కూలిపోయాయి. అందె లక్ష్మి, లింగాల మల్లేశ్, శ్రీనివాస్, కుండారపు లింగన్న, కుండారపు శ్రీనివాస్కు చెందిన ఇంటి నివాసాల పైకప్పులు లేచిపోయి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. సిగ్నల్ కోసం ఏర్పాటు చేసిన టవర్ వంగిపోయి ప్రమాదకరంగా మారింది. తర్లపాడు, పాత తర్లపాడు, సత్తనపల్లి, బీర్నంది, తదితర గ్రామాల్లో వరి, నువ్వు పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సింగాపూర్ గ్రామంలో పంటలను ఏవో అసం రవికుమార్ పరిశీలించారు. ముథోల్ మండలంలోని ఎడ్బిడ్, చించాల, వెంకటాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కడెం మండలంలోని అంబారిపేట, పెద్దబెల్లాల్, పాండ్వాపూర్, కొండుకూర్, పెద్దూర్తండా, ధర్మాజీపేట, మద్దిపడగ, చిట్యాల, లింగాపూర్ గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాఠాన్ గ్రా మంలో ఇంటి పైకప్పు ఎగిరిపడగా, మడావి ప్రశాంత్కు గాయాలయ్యాయి. మడావి అజయ్ ఇంటిపై కప్పు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. ఇంట్లో ఉన్న స్వాతి తన 8 నెలల పాపతో రాత్రంతా ఇంటి సజ్జ కింద తలదాచుకుంది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ హామీనిచ్చారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కే ప్రమోద్ రెడ్డి, నాయకులు విశాల్ , తదితరులున్నారు. ఉట్నూర్ మండలంలో ఘన్పూర్ వెళ్లే రహదారిపై చెట్ల కొమ్మలు విరిగిపడగా, ఎంపీపీ పంద్ర జైవంత్రావు ఆధ్వర్యంలో తొలగించారు.
కెరమెరి/దహెగాం/ రామకృష్ణాపూర్, మే 16: మండలంలోని పార్డ, ఖైరి గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలో ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ లైన్ల ను ఏఈ మందపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం పునరుద్ధరించారు.
పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు(కుర్మపల్లి)లో సోమవారం పిడుగుపడి అందుగుల రాయమల్లుకు చెందిన బర్రె పిడుగు పాటుతో మృతి చెందిందని పశువైద్యాధికారి వసీం ధ్రువీకరించారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని హామీనిచ్చారు. వార్డు కౌన్సిలర్ పనాస రాజు, రైతు బంధు మండల కో-ఆర్డినేటర్ బలికొండ కిషన్ స్థానికులు పాల్గొన్నారు.