జైనథ్, నవంబర్ 18 : కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మోసపోతామని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. శనివారం మండలంలోని కంఠ, ముక్తాపూర్, మాకోడ, పిప్పల్గాం, పుసాయి, పిప్పర్వాడ, మాండగడ, కమాయి, డొల్లార గ్రామాల్లో రోడ్షోల ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామగ్రామాన మహిళలు మంగళహారతులతో తరలివచ్చి వీరతిలకం దిద్ది ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి పేదలపై ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను బీజేపీ ప్రభుత్వం తెచ్చిందన్నారు.
జన్ధన్ పేరిట మహిళల బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని వేయలేదన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క ఉద్యోగం కూడా బీజేపీ సర్కారు ఇవ్వలేదన్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని 1200 ధరను పెంచిన బీజేపీకి ఓటు వేస్తారా, మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అని ప్రశ్నించారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలతో నేడు రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ఓటర్లు గుర్తించి కారు గుర్తును మంచిగా గమనించి ఓటు వేయాలని కోరారు.
కంఠ గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, నాయకులు యాసం నర్సింగ్రావ్, అల్లూరి కల్చాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ వేణుయాదవ్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్, సర్పంచ్లు బాలాజీ, దిలీప్, వెంకన్న, సంతోష్ రెడ్డి, పోతారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 18 : ఓటమి భయంతో నీచ రాజకీయాలకు బీజేపీ నాయకులు దిగజారుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. మండలంలోని ఆడ గ్రామంలోని శివాలయాన్ని సందర్శించుకోవడానికి వెళ్తే బీజేపీ నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ స్వగ్రామమైన ఆడ గ్రామంలో ఎమ్మెల్యేను కావాలనే కొందరు అడ్డుకోగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఆడ గ్రామంలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాయని, తాము ప్రచారం చేయడానికి బీజేపీ ఎందుకు అడ్డు పడుతోందని వారిని ప్రశ్నించారు. గ్రామంలోని శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నామని చెప్పి అడ్డుపడడం బీజేపీ నేతల వక్రబుద్ధికి నిరదర్శనమని మండిపడ్డారు. కొందరు కావాలని తమ పర్యటనను అడ్డుకున్నంత మాత్రన ఒరిగేదేమి లేదన్నారు. బీజేపీ నేతలు రౌడీల్లాగా వ్యవహరించడం సరికాదని అన్నారు.
తమ పర్యటనను అడ్డుకున్న బీజేపీ నేతల విలువనే దిగజారిందని స్పష్టం చేశారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రజలు తమ ఇష్టమైన నేతలకు వేసుకునే అవకాశం ఉందని, ఒత్తిడితో ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలు సరికాదని బీజేపీ నేతలను హెచ్చరించారు. ఇకనైనా ఇటువంటి కుటీల రాజకీయ ప్రయత్నాలు మానుకొని ప్రజలకు మంచి చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్కు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని స్పష్టం చేశారు. బీజేపీ సంక్షోభ పాలనను ఎంతమాత్రం కోరుకోవడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలను సైతం తప్పకుండా వచ్చే ఏప్రిల్ మాసం నుంచి అమలు చేస్తామని మరోసారి అభివృద్ధికే పట్టం కట్టి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మార్సెట్టి గోవర్ధన్, పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్ రెడ్డి, లింగారెడ్డి, వేణుగోపాల్ యాదవ్, సంతోష్, ప్రశాంత్ రెడ్డి, భోజన్న, ప్రభాకర్, చంద్రయ్య పాల్గొన్నారు.