ఇంద్రవెల్లి, జనవరి 17 : కెస్లాపూర్ నాగోబా జాతరను విజయవంతం చేద్దామని అధికారులకు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కెస్లాపూర్ నాగోబా దర్బార్హాలులో మంగళవారం ఐటీడీఏ పరిధిలోని అధికారులతో పాటు ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ఏర్పాట్లు, అభివృద్ధి క్యాక్రమాలపై చర్చించారు. ముందుగా నాగోబాను దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.
21న రాత్రి మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజలతో ప్రారంభమై జాతర ఉత్సవాలు 28వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహరాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. మర్రిచెట్లతోపాటు గోవాడ్ ప్రాంతంలో మరుగుదొడ్లతోపాటు, స్నానపు సౌకర్యాలు కల్పించి, నీటి సరఫరా చేయాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిఘా ఉంచాలన్నారు.
శాఖల వారీగా ఇచ్చిన ఏర్పాట్ల పనులు జాతర ప్రారంభంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఆర్డీవో కదం సురేశ్, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఐటీడీఏ ఏవో రామ్బాబు, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, ఐటీడీఏ ఈఈ భీంరావ్, డీఎల్పీవో భిక్షపతిగౌడ్, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, ఈవో రాజమౌళి, తహసీల్దార్ సోము, ఎంపీడీవో పుష్పలత, ఎఫ్ఆర్వో శిలానంద్, ఎస్ఐ డీ సునీల్, మెస్రం వంశీయులు లింబారావ్, బాజీరావ్, నాగ్నాథ్, దేవ్రావ్, సోనేరావ్, శేఖర్బాబు, ఆనంద్రావ్, మెస్రం షేకు తదితరులు పాల్గొన్నారు.