తాంసి, జూలై 12: ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం, వీవీప్యాట్ల ప్రదర్శన కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటికే ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున రెండు ప్రచార రథాలను ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు ఓటు వేయడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఓటరు https://www.nvsp.in పోర్టల్లో తమ ఎపిక్ నంబర్ను ఎంటర్ చేసి వివరాలను పరిశీలించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్ రమేశ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, నాయబ్ తహసీల్దార్ శ్రీవాణి, సాంకేతిక సహాయకుడు ఉమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంల తరలింపు
నిర్మల్ టౌన్, జూలై 12: నిర్మల్లోని ఈవీఎం గోదాముల్లోని మొదటి విడుత తనిఖీ పూర్తయిన ఈవీఎం, వీవీప్యాడ్లను బుధవారం ఆయా మండలాలకు తరలించినట్లు అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో ఓటర్లకు ఓటరు నమోదుపై రెవెన్యూ శాఖ అధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట ఆర్డీవో స్రవంతి, తదితరులు ఉన్నారు.