ఎదులాపురం,జూన్5: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగం గుణాత్మక మార్పు సాధించి, కరంటు కోతల దుస్థితి నుంచి వెలుగు జిలుగుల రాష్ట్రంగా ప్రకాశిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించిన విద్యుత్ దినోత్సవంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్నలతో కలిసి హాజరయ్యారు. ముందుగా కలెక్టర్,ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రగతిలో అత్యంగ కీలకమైన విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన సంస్కరణలు, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల ద్వారా సాధించిన విజయాల ప్రగతి నివేదికను ఎస్ఈ సంపత్ కుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రం నిరంతర విద్యుత్ కోసం తీసుకున్న చర్యలు, సాధించిన ప్రగతి, సోలార్,హైడల్, థర్మల్ విద్యుత్తు ఉత్సత్తి విద్యుత్ వ్యవస్థ బలోపేతం తదితర అంశాలపై వీడియో ద్వారా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న విద్యుత్ విజయోత్సవల్లో పాలొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పాడిన తరువాత వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యాపార, పరిశ్రమలలో ఉత్పత్తి పెరిగి ఎందరికో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. గతంలో 7778 మెగావాట్లు కాగా ప్రస్తుతం 18567 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు. జిల్లాలో ఒక లక్ష 47 వేల మంది రైతులకు రైతుబంధు ఇవ్వడంతో పాటు పంటల సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీలోని 600 ఆవాసాలకు విద్యుత్ సరఫరాతో పాటు సోలార్ కనెక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. రజకులు, నాయీబ్రాహ్మణులకు నెలకు 250 యూనిట్లు ఉచితంగా అందిస్తున్నట్లు వివరిం చారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడు తూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ సాధించిన ప్రగతిని వివరిస్తున్నట్లు తెలిపారు. గతంలో కరెంటు కోతలతో వ్యవసాయ రంగంలో పాటు పరిశ్రమలు మూతపడ్డాయన్నారు.
నేడు 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరాతో రాష్ట్ర అభివృద్ధి వైపు పయనిస్తున్నదని తెలిపారు. విద్యుత్ శఖ బలోపేతానికి కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో సందర్భంగా విద్యుత్ వినియోగదారులకు, రైతులకు , ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎందరో అమరుల త్యాగాల పునాదులతో ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రం 24 గంటల విద్యుత్ సరఫరాతో దేశంలోనే గొప్ప ఖ్యతిని సాధించిందన్నారు. అందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్కి, విద్యుత్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు కళాకారులు విద్యుత్ వినియోగం, అభివృద్ధి పై పాటలు, నృత్య రూపకంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ల్రైబరీ చైర్మన్ రావుత్ మనోహార్, డీపీవో శ్రీనివాస్, ఎంపీపీ గోవర్ధన్, డీఈ సుభాష్, ప్రజాప్రతినిధులు, రైతులు, వినియోగదారులు, విద్యుత్ , ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.