ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 29 : జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహసీల్దార్లను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలాబాద్ అర్బన్లో 542, ఆదిలాబాద్ గ్రామీణంలో 4, మావలలో 159, తాంసిలో 16, నేరడిగొండలో 2, ఉట్నూర్లో 1 చొప్పున మొత్తం 724 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి రిపోర్టు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
ప్రజా ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, భూ సమస్యలు, ఉపాధి, తదితర అంశాలకు సంబంధించిన అర్జీలను అదనపు కలెక్టర్లు నటరాజ్, రిజ్వాన్ బాషాషేక్ స్వీకరించారు.