జిల్లాలకు చేరిన గిఫ్ట్ ప్యాక్లు
త్వరలో పంపిణీ చేయనున్న అధికార యంత్రాగం
మసీద్ కమిటీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ
ఈ ఏడాది ఇఫ్తార్ విందు రద్దు
రాష్ట్రంలోని అన్ని మతాల వారు తమ పండుగలను ఘనంగా నిర్వహించుకునేలా సీఎం కేసీఆర్ వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలకు చీరెలు, అలాగే క్రిస్మస్, రంజాన్ పండుగలకు పేద కుటుంబాలకు దుస్తులు అందిస్తున్నారు. ప్రస్తుతం పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని తోఫా అందించే ఏర్పాటు చేశారు. ఈ గిఫ్ట్ ప్యాక్లో డ్రెస్ మెటీరియల్, చీర, కుర్తా ఫైజామాకు సంబంధించిన బట్టలు ఉన్నాయి. యేటా ఇఫ్తార్ విందు కూడా ఘనంగా ఇచ్చేవారు. ఈ ఏడాది కొవిడ్ కారణంగా రద్దు చేశారు.
త్వరలో పంపిణీ..
రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్లు అందించే బాధ్యతను ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించింది. ఆదిలాబాద్ అర్బన్, బోథ్ తహసీల్దార్లు భోజన్న, శివరాజ్ను ప్రత్యేక అధికారులుగా నియమించింది. వారి సమక్షంలో పకడ్బందీగా పంపిణీ చేయనున్నారు. స్థానిక మసీద్ కమిటీ నేతలు ఎంపిక చేసిన కుటుంబాలకే దుస్తులను అందించనున్నారు. తమ పవిత్ర పండుగకు, తెలంగాణ సర్కారు కానుకలు పంపించడంతో స్థానిక ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.