జైనథ్, సెప్టెంబర్ 18: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శనివారం మండలంలోని పెన్గంగ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ పరిధిలో రూ.20లక్షలతో గ్రావెల్ పనులు, రోడ్లపై గుంతులు లేకుండా చేశామని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ జాహిర్ రంజానీ, కమిషనర్ శైలజ, జైనథ్ సీఐ మల్లేశ్, ఎస్ఐ సాయిరెడ్డి వెంకన్న ఉన్నారు.
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు…
ఆదిలాబాద్లో ఆదివారం నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్చంద్ర తెలిపారు. మండలంలోని పెన్గంగ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి రోజు 500 వరకు గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 16మంది సీఐలు, 35మంది ఎస్ఐలు, క్లస్టర్ విభాగంలోని పోలీసులు ఇన్చార్జీలుగా ఉంటారని తెలిపారు. పట్టణంలోని 300పైగా గణేశ్ మండపాలకు జీపీఎస్తో అనుసంధానం చేశామన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100 , 8106674510 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
డీజేలకు అనుమతి లేదు
ఎదులాపురం, సెప్టెంబర్ 18: గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అంతటా 1173 వినాయక విగ్రహాలను ప్రతిష్టించారని ఆదివారం చివరి రోజున 500 విగ్రహాల నిమజ్జన శోభాయత్ర ఉంటుందన్నారు. జైనథ్ మండలం పెన్గంగ వద్ద సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో లైటింగ్, క్రేన్ సహాయంతో బారీ గణేశ్ విగ్రహాలను నిమజ్జనం పూర్తి చేస్తారని తెలిపారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ కృష్ణమూర్తి, ఎస్ఐ సయ్యద్ అన్వర్ ఉల్ హక్, కమ్యూనికేషన్ విభాగం ఇన్చార్జి గణేశ్ పాల్గొన్నారు.