పత్తి విత్తనాలు విత్తుతున్న రైతులు
అన్నదాతలకు ఇబ్బందుల్లేకుండావిత్తనాలు, ఎరువులు
గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
బేల, జూన్ 5 : రైతులు వానకాలం పనులకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో అన్నదాతలు కోటి ఆశలతో సాగు పనులు మొదలు పెట్టారు. శనివారం పలు గ్రామాల్లోని చేలల్లో పత్తి విత్తనాలు విత్తారు. గడ్డి మొలవకుండా ముందస్తుగా పిచికారీ చేశారు. కొంతమంది రైతులు తమ పొలాలను చదును చేసుకున్నారు. ఇదిలాఉంటే వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక, పంటసాగుపై సర్వేలు నిర్వహించడమే కాకుండా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
అధికంగా పత్తి సాగు..
ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ , బేల, జైనథ్, మావల, మండలాల్లో రైతులు అధికంగా పత్తిని సాగు చేస్తారు. ఆయా మండలాల్లో ఈ వానకాలంలో 46 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేగాకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముందస్తుగా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అనుమతులు ఉన్న డీలర్లు విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే గులా బీ పురుగు ఉధృతితో పత్తి పంట నష్టపోయిన కొంతమంది రైతులు ఈసారి సోయా పంట సాగువైపు దృష్టిసారిస్తున్నారు.
అందుబాటులో ఏఈవోలు..
గతంలో పంటలకు వస్తున్న తెగుళ్ల నివారణ చర్యలు తెలియక చాలామంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించింది. ఈ మేరకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో 27 మంది యువ ఏఈవోలు అందుబాటులో ఉన్నారు.
మట్టి నమూనా పరీక్షలు..
విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం కోల్పోతుంది. పంటల మార్పిడి సైతం లేకపోవడంతో తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడులపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం భూసార పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. రెండేళ్ల కాలానికి సంబంధించిన లక్ష్యాలను కేటాయించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మినీ భూసార పరీక్షా కేంద్రాలను మండలానికి మంజూరు చేశారు. క్లస్టర్ల వారీగా ఇవి ఏర్పాటు చేశారు.
రైతుబంధుతో 31,435 మందికి లబ్ధి..
నియోజకవర్గంలోని 31,435 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తున్నది. రెవెన్యూ శాఖకు చెందిన ఖాతాలే కాకుండా ఆర్వోఎఫ్ఆర్ కింద హక్కు పత్రాలు పొందిన వారికి కూడా అందజేస్తామని వ్యవసాయ శాఖ ఆదికారులు తెలిపారు.