భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు..
ఓఎస్డీ శరత్చంద్ర పవార్
దేవాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ
మావోయిస్టు కదలికలపై ఆరా
కాసిపేట, ఏప్రిల్ 5 : మావోయిస్టుల సిద్ధాంతాలను నమ్మి వారి బాటలో వెళ్లవద్దని, తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని ఓఎస్డీ (ఐపీఎస్) శరత్చంద్ర పవార్ సూచించారు. కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ను ఓఎస్డీ సోమవారం తనిఖీ చేశారు. మావోయిస్టు దళం కదలికల రిజిస్టర్, రికార్డులను పరిశీలించారు. మండల భౌగోళిక సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. మారుమూల గ్రామాలైన లక్ష్మీపూర్, కుర్రేఘడ్, మద్దిమాడ, పెద్ద అరడిపెల్లి, గట్రావ్పల్లి, బుగ్గగూడెం క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ.. యువత ఉన్నత విద్య అభ్యసించాలని సూచించారు. చదువుకుంటే మనల్ని మంచిస్థాయిలో నిలబెడుతుందని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ తోడుగా ఉంటుందన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో ప్రజలు గడిపేలా చూడడమే పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా పెట్టామని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓఎస్డీ వెంట ఏసీపీ ఎడ్ల మహేశ్, ఎస్ఐ విజయేందర్ ఉన్నారు.
మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు..
ప్రజాపోరాట ముసుగులో తిరుగుతున్న మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాణహిత పరీవాహక ప్రాంతంతో పాటు ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాలైన మోట్లగూడ, రావులపల్లి, రాంపూర్ తదితర గ్రామాల్లో కాగజ్నగర్ ఏఎస్పీ బాలస్వామితో కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులు గ్రామాల్లో వస్తే వారికి సహకరించవద్దన్నారు. అసాంఘిక శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. గత నెలలో రాంపూర్ గ్రామంలో ‘పోలీసులు-మీకోసం’లో భాగంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించుకున్న 70 మందికి అదనపు ఎస్పీ కళ్లద్దాలు, పలువురికి దుప్పట్లు అందజేశారు. ఆయన వెంట కాగజ్నగర్ ఏఎస్పీ బాలస్వామి, రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ రఘుపతి, తదితరులున్నారు.