మున్సిపల్చైర్మన్ జోగు ప్రేమేందర్
బంగారుగూడలో బీటీ రోడ్డు పనులకు భూమిపూజ
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 2: పట్టణంలో సేకరించిన తడి, పొడి చెత్తను డంప్యార్డుకు తరలించి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. బంగారుగూడలో ఆర్అండ్బీ నుంచి డంప్యార్డు వరకు రూ. 95 లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం నుంచి సేకరించిన చెత్తను డంప్యార్డుకు తరలించే క్రమంలో గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులతో చర్చించి బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. డంప్యార్డులో తడి, పొడి చెత్త నుంచి ఎరువులు తయారు చేసే పనులు చివరిదశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఇస్తారి, కొండా గణేశ్, డీఈ తిరుపతి, ఏఈ అరుణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. 25వ వార్డులోని పంజషా, చించర్వాడలో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డును అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. మౌలిక వసతుల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్ రాజేశ్, నాయకులు శివకుమార్, సతీశ్, తదితరులు ఉన్నారు.