ఇచ్చోడ, మే 20 : ఫర్టిలైజర్ షాపుల్లో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలుంటాయని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారి చంద్రకళ హెచ్చరించారు. మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను శనివారం వ్యవసాయ అధికారులతోపాటు టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా షాపుల్లో విత్తనాలు, పురుగు మందులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎమ్మార్పీకే విక్రయించాలని పేర్కొన్నారు. విత్తనాలు, మందులు కొనుగోలు చేసిన రైతుకు కచ్చితంగా రసీదు ఇవ్వాలని, బోర్డుపై ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైనా నకిలీ మందులు, విత్తనాలను విక్రయిస్తే వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలని, వారి గుర్తింపును గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో అధికారి ఎన్జడ్బీ దుర్గేశ్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి, ఏడీఏ రాంకిషన్, ఏఈవో సాయి రాం పాల్గొన్నారు.
బోథ్లో ..
బోథ్, మే 20: బోథ్లోని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాల్లో రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విత్తన దుకాణాల్లో నమూనాలు పరిశీలించారు. అనుమతిలేని హెచ్టీ బీటీ విత్తన జన్యువులను గుర్తించేందుకు వీలుగా రాపిడ్ పరీక్షలు నిర్వహించారు. మధుకర్ అండ్ కంపెనీ, శ్రీకాంత్ సీడ్స్, రంజిత్ సీడ్స్ తదితర షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఘన్పూర్ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును సందర్శించారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న లారీల్లో విత్తనాలుంటే రసీదులు పరిశీలించారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు చంద్రకళ, దుర్గేశ్, చంద్రమౌళి, బోథ్ ఏడీఏ శ్రీధర్స్వామి, మండల వ్యవసాయాధికారి వెండి విశ్వామిత్ర, ఏఈవోలు పాల్గొన్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, మే 20 : మండల కేంద్రంలోని విత్తన వ్యాపార దుకాణాలను రాష్ట్ర టాస్క్ఫోర్స్ టీం ఆకస్మికంగా తనిఖీ చేసింది. దుకాణాల్లో బీటీ -3 జన్యువు రాపిడ్ టెస్ట్ నిర్వహించారు. ఎలాంటి ఫలితాలు రాలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టాస్క్ఫోర్స్ టీం కన్వీనర్ చంద్రకళ, విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారి దుర్గేశ్, సీడ్ టాస్క్ఫోర్స్ సీఐ, బోథ్ ఏడీఏ శ్రీధర్స్వామి, ఎంఏవో బీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పీడీ యాక్ట్ నమోదు చేస్తాం..
నార్నూర్, మే 20 : ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు,ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకొని పీడీయాక్ట్ నమోదు చేస్తామని మండల వ్యవసాయ అధికారి జాడి దివ్య హెచ్చరించారు. గాదిగూడ,లోకారి(కే)లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ఫోర్స్ బృందం సభ్యులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో నకిలీ విత్తనాలు,ఎరువులు సరఫరా అయ్యే అవకాశం ఉంటుందని, పకడ్బందీగా నిఘా పెట్టామని తెలిపారు. ఇక్కడ టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు, వ్యవసాయశాఖ అధికారులున్నారు.
నిర్మల్లో..
నిర్మల్ టౌన్, మే 20 : వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున నకిలీ విత్తనాలు, రసాయన మందుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి నాగారాజు, సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ఎరువులు, విత్తనాల దుకాణాలను శనివారం తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లోని స్టాకు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదాంలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, ఎస్ఐ మహేశ్ ఉన్నారు.