నిర్మల్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ) : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ అంపశయ్యపైకి చేరింది. బొమ్మలు తయారు చేయడానికి అవసరమైన ప్రధాన ముడిసరుకు పొనికి కర్ర దొరకడం లేదు. ఫలితంగా దీనిపై ఆధారపడ్డ దాదాపు 200 కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. పదేండ్ల నుంచి కేంద్రంలోని బీజేపీ సర్కారును ఆదుకోవాలని వేడుకున్నా.
ఎగుమతుల విషయంలో రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు అందించాలని విన్నవించినా పట్టించుకోవడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం సహకారం అందించినా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆదుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం కూడా పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా.. బీజేపీ పెద్దలు కనికరించక పోవడంతో పరిశ్రమ అంపశయ్యపైకి చేరుకున్నది.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి బీజేపీ ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొయ్య బొమ్మల పరిశ్రమను ఆదుకుంటామని, పూర్వవైభవం తీసుకొస్తామని, కళాకారులందరికీ జీవనోపాధి మెరుగుపరుస్తామని బహిరం గ సభా వేదికపై ప్రకటించారు. అంతేకాకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోలేదంటూ విమర్శలు గుప్పించారు. తాము ఎన్నికలు ముగియగానే ఆదుకొని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే ఎన్నికలై నెల రోజులు గడిచినా హామీలు నెరవేర్చక పోవడం విమర్శలకు తావిస్తున్నది. పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పకడ్బందీ కార్యాచరణను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పొనికి కర్ర కొరత కారణంగా ఐదారేళ్లుగా పరిశ్రమ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇక్కడి అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ నిరంతరాయంగా జరగక పోవడం, చెట్లు కనుమరుగై పోవడంతో కలప లభ్యత కష్టంగా మారింది. మొన్నటి వరకు అటవీ శాఖ ఆధ్వర్యంలోని టింబర్ డిపోల్లో పొనికి నిల్వలను కొనుగోలు చేసి బొమ్మలు తయారు చేసేవారు. డిపోల్లో నిల్వలు తగ్గిపోవడంతో పొరుగు జిల్లాలతోపాటు, సరిహద్దు రాష్ర్టాల్లో కూడా అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే కొయ్య బొమ్మల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది.
పరిశ్రమ ఉనికికి ముప్పు తప్పదని భావించిన కేసీఆర్ ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. హరితహారం పథకంలో భాగంగా పొనికి మొక్కల ప్లాంటేషన్ను పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలుగా మామడ మండలంలోని కొరిటికల్, గాయిద్పెల్లి, వాస్తాపూర్, లింగాపూర్, తోటిగూడ గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది. మొదట లింగాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో హరితహారం కింద 1000 పొనికి మొక్కలు నాటారు. అలాగే వాస్తాపూర్, గాయిద్పెల్లి గ్రామాల్లో దశలవారీగా పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పరిశ్రమను ఆదుకునే చర్యలు చేపట్టాలని కళాకారులు కోరుతున్నారు.
రాబోయే రోజుల్లో ఈ కళ ముందు తరాలకు వెళ్లాలంటే పొనికి చెట్లను బాగా పెంచాలి. కేంద్ర ప్రభుత్వం అటవీ అనుమతులను కూడా సులభతరంగా ఇవ్వాలి. మొన్నటి ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్మల్ వచ్చినప్పుడు కొయ్య బొమ్మల పరిశ్రమను ఆదుకుంటామన్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి స్పందన లేదు.
– శ్రీనివాస్, కొయ్య బొమ్మల కళాకారుడు, నిర్మల్.