మంచిర్యాల ఏసీసీ, మార్చి 16: అనారోగ్యం, ఆపద పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ సూచించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గత బుధవారం జరిగిన సంఘటనను ‘నమస్తే తెలంగాణ’లో ‘రోగైనా… శవమైనా మా అంబులెన్స్లోనే’.. అనే కథనంపై ఆయన స్పందించారు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన వద్ద ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్లు, డ్రైవర్ల దౌర్జన్యంపై ఈ కథనం రాగా, మంచిర్యాల డీసీపీ ఆశోక్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో వారితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కమీషన్లకు లాలూచి పడి వారిని మోసగించవద్దని, వీలైతే వారికి సహాయం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. రోగులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. పద్ధతి మార్చుకోకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ఐలు లక్ష్మణ్, మహేందర్, రాములు, సిబ్బంది పాల్గొన్నారు.