నిర్మల్ టౌన్, డిసెంబర్ 5 : జిల్లాలో సమగ్ర ఓటరు జాబితాను పకడ్బందీగా చేపట్టినట్లు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి స్పందన లభించిందన్నారు. 8వ తేదీ వరకు కొత్త ఓటరు నమోదుకు అవకాశం, మార్పులు, చేర్పులు, తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారిలో 26వేల మందికి గుర్తింపుకార్డులను ఇచ్చినట్లు తెలిపారు. వాటిని పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని పోలింగ్ బూత్ల్లో బీఎల్వోల సమక్షంలో కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, పేర్ల తొలగింపు విచారణ జరిపిన తర్వాతనే తొలగిస్తున్నామని వివరించారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఆధార్ లింక్ 76 శాతం పూర్తయిందని, మరో 15 రోజుల్లో వందశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.