దస్తురాబాద్, జనవరి 22 : మండలంలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. గత ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. చెరువులు, బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికి తోడుగా కడెం ప్రాజెక్ట్ నుంచి వారబందీ పద్ధతిలో సాగుకు నీటిని విడుదల చేశారు. దీంతో మండలంలో యాసంగి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో సాగునీటి వనరుల కింద వరి సాగు చేయగా, మరి కొన్ని గ్రామాల్లో కడెం ప్రాజెక్ట్ నీరే ఆధారంగా వరినాట్లు వేస్తున్నారు. వానకాలం పంట పూర్తిగా చేతికి వచ్చింది. దీంతో ఆసల్యం చేయకుండా యాసంగి సీజన్ పనులకు రైతులు సిద్ధమయ్యారు.కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వరి నాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో కొనసాగుతున్నాయి.
ఈ సారి దొడ్డు రకం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది కంటే ఈసారి యాసంగి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, రైతుబంధు డబ్బులు అందడంతో సాగుకు రంది లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో పసుపు, మక్క, నువ్వులు, పల్లి, ఆవాలు, శనగ తదితర పంటలను కొంత మంది రైతులు సాగు చేస్తున్నారు.
రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా రైతు బంధు, రైతు బీమా, ఉచితంగా 24 గంటల విద్యుత్ వంటి పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నది. ఎరువులు, మందులను సైతం అందుబాటులో ఉంచుతున్నది. గతేడాది వానకాలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఎక్కువగా చెరువులు, బోర్లు, వ్యవసాయ బావుల కింద, కడెం ప్రాజెక్ట్ కింద రైతులు వరి సాగు చే స్తున్నారు. దీంతో గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. గతేడాది 6,500 ఎకరాల్లో వరి సాగైంది. ఈ ఏడాది దాదాపు 8 వేల ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారని అధికారులు పేర్కొంటున్నారు. మండలంలో ఆరుతడి పం టల సాగుసైతం ఎక్కువగానే ఉంది. 35 ఎకరాల్లో మక్క, 26 ఎకరాల్లో నువ్వులు, 9 ఎకరాల్లో ఆవాలు, ఏడెకరాల్లో శనగ, ఐదెకరాల్లో పల్లి పంటలు సాగు చేస్తున్నారు. కాగా, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు సాగు చేస్తున్న పంటలను స్వయంగా పరిశీలిస్తున్నారు. వాటి వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు.