దస్తురాబాద్, డిసెంబర్ 30 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బోగస్ జాబ్ కార్డులకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పథకంలో మరింత పారదర్శకత పెంచేందుకు లబ్ధిదారుల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రారంభించింది. అన్నింటికీ త ప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వాలకు నష్టం వాటిల్లకుండా, అసలైన కూలీలకు లబ్ధిపొందేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే కూలీల ఆధార్కార్డులో పేరు ఉన్నట్లుగానే జాబ్ కార్డులో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి శనివారం (డిసెంబర్ 31) చివరి రోజుగా నిర్ణయించింది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు జాబ్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
మండలంలో 9,702 మంది కూలీలు..
ప్రస్తుతం మండలంలో 4,604 జాబ్ కార్డులున్నాయి. ఇందులో 9,702 మంది కూలీలు ఉన్నారు. కాగా, వర్కింగ్లో 3,679 జాబ్ కా ర్డులుండగా.. 6,785 మంది కూలీలు ఉపాధి పథకాన్ని వినియోగించుకుంటున్నారు. దాదా పు 2000 మంది కూలీలకు పైగా జాబ్కార్డుకు ఆధార్ అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. 30 శాతం పైగా జాబ్కార్డుకు ఆధార్ లింక్ అయినట్లు పేర్కొన్నారు.
అక్రమాలకు చెక్..
గతంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు, అక్రమాలు బాగా చోటుచేసుకునేవి. ఆధార్ కార్డు లింక్తో వాటికి అడ్డుకట్ట పడనున్నది. డబుల్ జాబ్కార్డులుంటే ఆధార్ అనుసంధానంతో బట్టబయలవుతాయి. అవకతవకలకు తావులేకుండా కూలీలకు బిల్లులు చెల్లించే వీలుంటుంది. ఆధార్ అనుసంధానంతో ఒక్క జాబ్కార్డులో ఒకరి పేరే ఉండే అవకాశం ఉంది. కాగా, ఒకవేళ ఏదైనా కారణంతో ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే జాబ్కార్డున్నా వారు పనికి అనర్హులు అవుతారు. పని చేసినా ఆధార్ అనుసంధానం ఉన్న వాళ్లకే డబ్బులు వస్తాయి. ఆధార్ కార్డు ఆధారంగానే డబ్బులు చెల్లిస్తారు. దీంతో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి
జాబ్కార్డులకు ఆధార్ కార్డు అనుసంధానం చేసేందుకు ప్రజలు సంబంధిత గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఉపాధి పనుల్లో అక్రమాలకు తావులేకుండా జాబ్కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసింది. అనుసంధానం కోసం ఇంకా ఒక రోజే సమయం ఉంది. అర్హులు అనుసంధానం చేయించుకోవాలి. ప్రస్తుతం దాదాపు 2000 మందికి పైగా కూలీలు లింక్ చేసుకున్నారు. మిగిలిన వారు సైతం చేయించుకుంటే ప్రయోజనం పొందుతారు. కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆధార్ అనుసంధాన ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
– రవి ప్రసాద్, ఏపీవో
అనుసంధానం తప్పనిసరి
లబ్ధిదారుల జాబ్కార్డులకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల జాబ్కార్డులకు ఆధార్కార్డు అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే కూలీలకు పని కల్పించడం వీలు కాదు. కూలీలు చేసిన పనులకు డబ్బులు రావు. అనుసంధానంతో పనుల్లో పారదర్శకత ఉంటుంది. అక్రమాలకు ఆస్కారం ఉండదు. కూలీలు తప్పనిసరిగా తమ జాబ్కార్డులకు ఆధార్కార్డు అనుసంధానం చేయించుకొని లబ్ధిపొందాలి.
– వెంకటేశ్వర్లు, ఎంపీడీవో