ఎదులాపురం, ఏప్రిల్ 13 : ఆదిలాబాద్ చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టణంలోని అంబేద్కర్చౌక్లో ఆవిష్కరించినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.45లక్షలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యుత్ కాంతుల నడుమ భారీ క్రేన్ సాయంతో ఎమ్మెల్యే జోగు రామన్న స్విచ్ ఆన్ చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ‘జై భీమ్, జై అంబేద్కర్’ అంటు నినాదాలు చేశారు. బుద్ధ వందనం ఆలపించి పంచశీల్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అంబేద్కర్ అందరికీ దేవుడన్నారు. నేడు మనం ఇక్క డ ఉన్నామంటే ఆయన కృషి వల్లే అని గుర్తుచేశారు.
స్వ రాష్ట్రం ఆర్టికల్-3తోనే సాధ్యమైందన్నారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినట్లు చెప్పారు. ఆవిష్కరణకు కృషి చేసిన ఉత్సవ సమితి అధ్యక్షుడు దుర్గం శేఖర్ను అభినందించారు. అన్ని పార్టీల నాయకులు హాజరకావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రాథోడ్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీఎస్పీ వీ ఉమేందర్, గౌరవాధ్యక్షుడు మేకల మల్లన్న, మల్యాల స్వామి, కో కన్వీనర్లు బాబా సాహెబ్ కాంబ్లే, రత్నజాడే ప్రజ్ఞకుమార్, సొగల సుదర్శన్, మస్కే రాజు పటాడే తదితరులు పాల్గొన్నారు.