బెల్లంపల్లిరూరల్/నెన్నెల/మందమర్రి రూరల్, మార్చి 13: మంచిర్యాల జిల్లాలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందుగా ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా, కాసేపటికే ప్రియుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి మండలంలోని మామిడిగట్టు గ్రామానికి చెందిన నాంపల్లి గంగ, ఓదెలుకు ముగ్గురు బిడ్డలు. వీరిలో సంగీత(21) రెండో బిడ్డ. పెద్దకూతురు సంధ్యకు పెళ్లి చేయగా, అత్తవారింట్లో ఉంటున్నది. సంధ్య కొడుకు మాత్రం అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. బుధవారం అక్క కొడుకుతో సంగీత దురుసుగా ప్రవర్తించడంతో తల్లి మందలించింది. ఆ తర్వాత కూలీ పనులకు వెళ్లిన తల్లి తిరిగి వచ్చేసరికి, ఇంట్లో దూలానికి సంగీత ఉరేసుకొని కనిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే సంగీతను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి గంగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన తీగుళ్ల భగవాన్ (23), నాంపల్లి సంగీత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. సంగీత ఆత్మహత్య విషయం తెలుసుకున్న భగవాన్ జీర్ణించుకోలేకపోయాడు. బుధవారం సాయంత్రం తన ఆటోట్రాలీలో బెల్లంపల్లి మండలంలోని దుగినెపల్లి అటవీప్రాంతంలోకి వెళ్లి వెం ట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి బలవన్మరణంతో మామిడిగట్టు, చిత్తాపూర్ గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. భగవాన్ మృతిపై తాళ్లగురిజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.