ఆదిలాబాద్, ఆగస్టు 13 ( నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సర్కారు రైతన్నలకు ఎరువుల కొరత లేకుండా చూస్తున్నది. ఇందుకుగాను వ్యవసాయ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పత్తి, సోయా, కందులు సాగు చేస్తుండగా.. అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేయగా.. 1,00,756 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వచ్చాయి. అధికారులు నెలవారీగా పంటలకు అవసరమైన సమయంలో సరఫరా చేస్తున్నారు. ఎరువుల కొరత లేకపోవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ దండుగ అనే పరిస్థితులు ఉండేవి. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలితంగా తొమ్మిదేండ్లలో వ్యవసాయం పండుగలా మారింది. గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా రైతులు ఎరువులు, విత్తనాల కోసం రోడెక్కాల్సిన పరిస్థితి. విక్రయ కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులుకాసినా ఎరువులు దొరికేవి కావు. పోలీసు బందోబస్తు మధ్య ఎరువుల విక్రయాలు జరిగేవి. రైతులకు పది మందు బస్తాలు అవసరమైతే రెండుమూడింటితో సరిపెట్టేవారు. దీంతో పంటలకు అవసరమైన ఎరువులు వేయకపోవడంతో రైతులు నష్టపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు లభిస్తున్నాయి. రెండు సీజన్లకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు సమయానికంటే ముందుగానే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రైతులు వివిధ పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా లో ఈ వానకాలం సీజన్లో 5.66 లక్షల ఎకరా ల్లో పంటలు సాగవతున్నట్లు అధికారులు అంచనాలు తయారు చేశారు. ఇందులో 3.57 లక్షల ఎకరాల్లో పత్తి, 1.32 లక్షల ఎకరాలోల సోయా, 66 వేల ఎకరాల్లో కందితో పాటు ఇతర పంటలు సాగుచేస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పెన్గంగ పరీవాహక ప్రాంతాలు, ఇతర చోట్ల రైతులు పంటలు నష్టపోయారు. పంటలు సాగులో భాగంగా రైతులకు ఎ రువుల కొరత లేకుండా అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలో వానకాలం సీజన్లో 90 వేల మెట్రిక్ ట న్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారు లు అంచనా వేశారు. కాగా, 1,00,756 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులోకి వ చ్చాయి. దుఖాణాలు, ప్రాథమిక వ్యవసాయ సం ఘాల ద్వారా రైతులకు వాటిని పంపిణీ చేస్తున్నారు.
అందుబాటులో 1,00,756 మెట్రిక్ టన్నులు..
జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. యూరియా 30 వేల మెట్రిక్ టన్నులు.., డీఏపీ 13 వేల మెట్రిక్ టన్నులు.., ఎంవోపీ 7 వేల మెట్రిక్ టన్నులు.., ఎస్ఎస్పీ 4 వేల మెట్రిక్ టన్నులు.., కాంప్లెక్స్ 36 వేల మెట్రిక్ టన్నులు వినియోగంకానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఎరువుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. వివిధ కంపెనీల నుంచి ఎరువుల ర్యాక్లు నేరుగా జిల్లాకు చేరుకునేలా చూశారు. అధికారులు ముందస్తు చర్యల ఫలితంగా సీజన్లో 81,171 మెట్రిక్ టన్నుల ఎరువులు ర్యాక్ల ద్వారా జిల్లాకు చేరుకున్నాయి. గతంలో అధికారులు నిల్వ చేసిన 19,853 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. దీంతో జిల్లాలో ఈ సీజన్లో 1,00,756 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. యూరియా 43,911 మెట్రిక్ టన్నులు.., డీఏపీ 15,547 మెట్రిక్ టన్నులు.., ఎంవోపీ 1871 మెట్రిక్ టన్నులు.., ఎస్ఎస్పీ 3,826 మెట్రిక్ టన్నులు.., కాంప్లెక్ ఎరువులు 35,573 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 59,804 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 40,952 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నాయని, వీటిని మార్క్ఫెడ్, కంపెనీ గోదాములతో పాటు, ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, వ్యాపారుల వద్ద నిల్వ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
రైతులకు అవసరమైన ఎరువుల పంపిణీ..
జిల్లాలో వానకాలం సీజన్లో రైతులు ఎరువుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. వివిధ పంటలకు కావాల్సిన ఎరువుల అంచనాలను ముందుగానే తయారు చేశాం. ర్యాక్ల ద్వారా క్రమంగా ఎరువులు జిల్లాకు చేరేలా పర్యవేక్షిస్తున్నాం. ముందుగా రైతులుకు ఏ నెలలో ఎన్ని ఎరువులు అవసరమవుతాయో గుర్తించి సరఫరా చేస్తున్నాం. జిల్లాలో ఎరువుల విక్రయాలు, నిల్వలను నిరంతరం పరిశీలిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా అసలైన రైతులకు మాత్రమే ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. సీజన్ చివరి వరకు కొరత లేకుండా ఎరువులను పంపిణీ చేస్తాం.
– డీ పుల్లయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి