ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/ఇంద్రవెల్లి, డిసెంబర్ 17 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం మంత్రి ఆలయంలో నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.10.35 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మెస్రం వంశీయులు రూ.5 కోట్ల విరాళాలు సేకరించి గుడిని రాతి శిల్పాలతో నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణలో ఆధ్యాత్మిక క్షేత్రాల్లో యాదాద్రి తర్వాత నాగోబా దేవాలయం ఉందన్నారు. జాతరకు తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. దర్బార్, జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా మిషన్ భగీరథ నీరు, విద్యుత్, రహదారి సౌకర్యం కల్పిస్తామన్నారు. నిత్యపూజ, దీపధూప నైవేద్యాల కోసం పూజారులు, ఆలయ పర్యవేక్షణకు సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. నాగోబా జాతర పూజ రోజు హాజరయ్యే భక్తులకు పౌష్టికాహారం ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు.
దండారీ ఉత్సావాలకు రూ. కోటి
గిరిజనులు ఉత్సాహంగా జరుపుకునే దండారీ ఉత్సవాలకు గూడేనికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వ రూ. కోటి మంజూరు చేస్తున్నదని మంత్రి అన్నారు. గుడిరేవు పద్మపూరి అలయానికి రూ.50 లక్షలు, జంగుబాయి ఉత్సవాలకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ ఎంపీ నగేశ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్రెడ్డి, పిఠాధిపతి వెంకట్రావు, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఇంద్రవెల్లి, నేరడిగొండ జడ్పీటీసీలు పుష్పలత, అనిల్జాదవ్, సర్వంచ్ రేణుక పాల్గొన్నారు.
ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం..- ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
జనవరి మాసంలో ప్రారంభమయ్యే కేస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతర ఏర్పాట్లపై త్వరలోనే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి భక్తుల సౌకర్యాలపై చర్చిస్తామన్నారు. మెస్రం వంశీయులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటమన్నారు.
కొనసాగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు..
నాగోబా ఆలయ ఆవరణలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాతున్నాయి. శనివారం రాత్రి ఇచ్చోడ మండలంలోని మహదాపూర్కు చెందిన నారాయణ మహారాజ్ పాల్గొని భక్తులకు ప్రవచనాలు బోధించారు. నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ శ్యామ్, సుమలత తరఫున వెండి కిరీటం బహూకరించారు. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన మెస్రం వంశీయుల ఆడబిడ్డలకు మెస్రం వంశీయులు నూతన వస్ర్తాలను బహూకరించారు. మెస్రం వంశీయుల్లోని 22 కితలకు చెందిన తమ తమ అక్కాచెల్లెళ్లతోపాటు అల్లుళ్లకు నూతన వస్ర్తాలు అందించారు. దీంతో నాగోబా ఆలయంతోపాటు గోవాడ్ ప్రాంతాల్లో వేలాది మంది మెస్రం వంశీయుల ఆడబిడ్డలు సందడి చేశారు.
ఆలయానికి చేరిన కలశాలు
మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో కలశాలను శనివారం సాయంత్రం కేస్లాపూర్ నుంచి నాగోబా ఆలయానికి తరలించారు. హనుమాన్ ఆలయంలో భద్రపర్చిన కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. తమ అల్లుళ్లతో కలశాలను ఆలయం బయటకు తీశారు. భారీ ఉరేగింపుతో నాగోబా ఆలయానికి సంప్రదాయవాయిద్యాల మధ్య తరలించి, ఆలయంలో భద్రపర్చారు. ఆదివారం ఉదయం ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభించనున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు.