ఆదిలాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సర్కారు ఆదేశాల మేరకు గతంలో వైరస్ను విజయవంతంగా నియంత్రించిన అధికారులు, మరోసారి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని రిమ్స్లో మాక్డ్రిల్ నిర్వహించారు. రిమ్స్లో 500 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉంచారు. బోథ్, ఉట్నూర్ దవాఖానల్లో 20 బెడ్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. వైరస్ లక్షణాలున్న వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ర్యాపిడ్, పీపీఈ కిట్లు, సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి కరోనా కిట్లు పంపిణీ చేయనుండగా, వైరస్ తీవ్రతను బట్టి మెరుగైన చికిత్స కోసం రిమ్స్ చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిమ్స్లో ఆక్సిజన్ తయారీ కేంద్రం ఉండగా, నిర్వహణ సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అర్హులందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా జిల్లాలో కరోనా ప్రభావం లేదు.
బూస్టర్డోస్ పంపిణీ..
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే మూడు విడుతలుగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. మొదటి, రెండో డోస్తో పాటు బూస్టర్డోస్ అందించింది. ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించారు. దీంతో కరోనా కేసులు తగ్గిపోయాయి. దేశ వ్యాప్తంగా ఇటీవల మళ్లీ కేసులు పెరుగుతుండడంతో వైరస్ ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం మందుస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా మరో విడుత బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాకు 8 వేల డోసుల కార్బో వ్యాక్స్ వ్యాక్సిన్ రాగా, వైద్యశాఖ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టీకాలను పంపిణీ చేశారు. వైద్యశాఖ అధికారులు గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని దవాఖానల్లో టీకా పంపిణీ ప్రారంభించారు. అర్హులందరూ గతంలో తీసుకున్న టీకా వివరాలు గానీ, ఆధార్కార్డు తీసుకువచ్చి బూస్టర్డోస్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో కోవిషిల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం కార్బో వ్యాక్స్ తీసుకోవచ్చని, 12 ఏండ్లు దాటిన వారందరికీ బాస్టర్డోస్ వేస్తాయమని తెలిపారు.
అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అర్హులందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలి. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా టీకాను పంపిణీ చేస్తున్నాం. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించడంతో పాటు, భౌతికదూరం పాటించాలి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారు. కొవిడ్ లక్షణాలున్నవారు ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్ సోకిన వారికి మందులు, చికిత్స అందిస్తాం.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్