సీసీసీ నస్పూర్, జనవరి 26 : ‘రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే.. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.’ అంటూ బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మండిపడ్డారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం బీఆర్ఎస్ భవన్లో చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా గడవక ముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చారని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచి వాగ్ధ్దానాలు నెలవేర్చలేకపోతున్నారని, చెన్నూర్లో 45 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, అగ్రికల్చర్ యూనివర్సిటీ, మండలానికో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు ఊసెత్తడం లేదన్నారు.
చెన్నూర్ ఎత్తిపోతల పథకం, అయిల్పాం ఫ్యాక్టరీలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తే వాటిని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు రూ. 2500 భృతి, వృద్ధులకు పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ ఏమైందని ప్రశ్నించారు. రైతుబంధు కోసం ఎన్నికలకు ముందు కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారులో ఎన్నికలకు ముందు 7 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తే రద్దు చేయడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపుతో కేసులు, దాడులు చేస్తే సహించేదిలేదన్నారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలతో నీతిలేని రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల కోసం ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే లాఠీ దెబ్బలు తింటామని, జైలుకు కూడా వెళ్లడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉందన్నారు.
అబద్ధపు ప్రచారాలతో గెలిచిన కాంగ్రెస్కు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పుకొచ్చారు. ఈ నెల 30న బెల్లంపల్లి, ఫిబ్రవరి 4న చెన్నూర్, 5న మంచిర్యాల నియోజకవర్గాల్లో సమావేశాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో నాయకులు నడిపెల్లి విజిత్రావు, తిప్పని లింగయ్య, అక్కూరి సుబ్బయ్య, మేరుగు పవన్కుమార్, ఈసంపల్లి ప్రభాకర్, పెట్టం లక్ష్మణ్, బేర సత్యనారాయణ, మేడిపల్లి సంపత్, వంగ తిరుపతి, కుర్మిళ్ల అన్నపూర్ణ, గర్శె రామస్వామి, గోగుల రవీందర్రెడ్డి పాల్గొన్నారు.