ఒక్కసారిగా 7 శాతం జీఎస్టీ పెంపు
ఇకపై 12 శాతం వాత
జనవరి 1 నుంచి అమలుకు నిర్ణయం
కొవిడ్ నష్టం నుంచి తేరుకోక ముందే బీజేపీ మరో దెబ్బ
కార్మికుల ఉపాధికి గండి.. ఆందోళనలో శ్రామికులు
ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ. 100 కోట్ల వ్యాపారం
27 నుంచి మూడు రోజుల నిరసనకు కార్మిక వర్గాల సన్నద్ధం
నిర్మల్ టౌన్ డిసెంబర్ 24: వస్త్ర వ్యాపారంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న బడుగు జీవులపై కేంద్రం మరో పిడుగు వేసింది. కొవిడ్తో నష్టపోయి ఇప్పటికే ఆందోళనలో ఉన్న వ్యాపారులపై, పన్నుపోటుతో మరింత భారం పెంచింది. రెండేళ్ల క్రితమే 5 శాతం జీఎస్టీ వేయగా, నాడు కార్మికలోకమంతా ఆందోళనకు దిగింది. అయినా వెనక్కితగ్గని కేంద్రం అదే ట్యాక్స్ను కొనసాగించింది. తాజాగా మరో 7 శాతం పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వస్త్ర వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపార, కార్మిక వర్గం ఈనెల 27 నుంచి మూడు రోజుల నిరసనకు సన్నద్ధమవుతున్నది.
కేంద్రం మరో పిడుగులాంటి వార్త ప్రకటించడంతో వస్త్రరంగంపై ఆధారపడిన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రెండేళ్ల క్రితమే వస్త్ర వ్యాపారంపై జీఎస్టీని అమలు చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీని అమలు చేసింది. తాజాగా మరో ఏడు శాతానికి పెంచి 12 శాతం అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే జనవరి నుంచి 12 శాతం జీఎస్టీ అమలు చేసేందుకు కేంద్ర జౌళీ శాఖ సిద్ధమవుతున్నది. దీంతో ఈ ప్రభావం వస్త్ర వ్యాపారంపై తీవ్రంగా పడనుంది. సమైక్య పాలనలో ఆకలి చావులతో అల్లాడుతున్న నేతన్నలకు తెలంగాణ సర్కారు చేయూతనందించింది. నేత కార్మికులకు ప్రతినెలా రూ. 2016 పింఛన్ను అందిస్తున్నది. రుణమాఫీ, పవర్లూం పరిశ్రమలకు సబ్సిడీపై రుణ సదుపాయం వంటివి కల్పిస్తూనే బతుకమ్మ చీరలు తయారు చేయించి చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందిస్తున్నది. దీంతో కొద్దికొద్దిగా కార్మికుల జీవితాలు గాడిలో పడుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న జీఎస్టీ పెంపు వారికి శాపంగా మారనుంది. ఇప్పటికే వస్త్ర వ్యాపారానికి ఉపయోగించుకునే అన్ని రకాల ముడి సరుకుల ధరలతోపాటు, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి ఉపాధి గుదిబండలా మారింది. కొవిడ్ కాలంలో వ్యాపారం పడిపోయిన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వస్త్ర వ్యాపారులకు మింగుడు పడడం లేదు.
ఉమ్మడి జిల్లాలో వందకోట్ల వస్త్ర వ్యాపారం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏటా రూ. 100 కోట్ల పైగానే వస్త్ర వ్యాపారం జరుగుతుంది. జిల్లాలో మొత్తం 2వేల హోల్సేల్ బట్టల దుకాణాలతో పాటు, 50 షాపింగ్ మాల్స్, మరో పదివేల చిల్లర వ్యాపారులు వస్త్ర వ్యాపారాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. అమ్ముడుపోయే ప్రతి వస్ర్తాన్ని టెక్స్టైల్స్ రంగంలో పనిచేసే కార్మికులు తయారుచేస్తున్నవే. అటువంటి టెక్స్టైల్స్ రంగంలో తయారు చేసిన వస్ర్తాలపై ఐదుశాతం ఉన్న జీఎస్టీని మరో ఏడుశాతం పెంచి 12 శాతానికి చేర్చడంతో ఆ ప్రభావం వ్యాపారులు, వినియోగదారులపై పడనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వస్త్ర వ్యాపారం ద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి లభిస్తున్నట్లు ఒక అంచనా. కొవిడ్ తరువాత ఇప్పుడిప్పుడే వ్యాపారం పుంజుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పన్నుపోటు విధించడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి సగటున వందకోట్ల వ్యాపారం జరిగితే, రూ. కోటీ 20 లక్షలు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ పన్ను 50 లక్షలు మాత్రమే ఉండేది. పన్ను పెంచితే నిల్వ ఉన్న వస్ర్తాలపై మరింత భారం పడనుంది. ఈ నేపథ్యంలో వస్త్ర వ్యాపారులు ఈనెల 27 నుంచి పన్ను పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
జీఎస్టీ భారం మోయలేం..
కేంద్ర ప్రభుత్వం వస్త్ర రంగంపై వ్యాట్ పన్నును ఐదుశాతం నుంచి 12 శాతానికి పెంచడం సరికాదు. వ్యాపారులు ఈ భారాన్ని మోయలేరు. . వస్త్ర వ్యాపారాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చవద్దని రెండేళ్ల క్రితమే ఆందోళన చేసినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 5 శాతం పన్నును విధించింది. ఆ తరువాత కరోనా రావడంతో వ్యాపారం పూర్తిగా పడిపోవడం, ఖర్చులు పెరగడంతో మేమంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు కేంద్రం జనవరి 1 నుంచి 12 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించడం, మాపై తీవ్ర ప్రభావం పడనుంది.
-గుమ్మిడాల దత్తాద్రి, సీనియర్ వస్త్ర వ్యాపారి
రాష్ట్రం రాయితీలిస్తే.. కేంద్రం ఎసరు పెడుతున్నది..
చేనేత కార్మికులు తయారుచేసిన అన్ని రకాల వస్ర్తాలను మార్కెట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ప్రోత్సహిస్తున్నది. కార్మికులకు ప్రతినెలా రూ. 2016 పింఛన్ను అందిస్తున్నది. టెక్స్టైల్ పరిశ్రమలకు రాయితీపై రుణాలను అందిస్తున్నది. అందమైన, ఆకర్షనీయమైన చేనేత వస్ర్తాలను తయారుచేసి చేనేత విక్రయ కేంద్రాల ద్వారా విక్రయించడం ద్వారా చేనేతా కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వం రాయితీలు, పెన్షన్ ఇవ్వకపోగా ముడి సరుకుల ధరలు పెంచడం, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం చేస్తున్నది. దీని వల్ల వస్ర్తాల తయారీపై ఆ భారం పడుతుంది.
-అంజయ్య, చేనేత ఖాదీ భండార్, నిర్మల్ జిల్లా మేనేజర్
భారమంతా ప్రజలపైనే
నేను పదో తరగతి నుంచి చేనేత బట్టల నే కొంటున్న. చేనేత బట్టలు తొడగడం వలన సమాజంలో గౌరవం, ఆరోగ్యా నికి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. చేనేత కార్మికులకు చేయూతను అందిం చడానికి కొనుగోళ్లు కూడా ప్రభావం చూపుతాయి. ఇప్పుడు కేంద్ర ప్రభు త్వం చేనేత బట్టలపై జీఎస్టీని 12 శాతానికి పెంచడంతో, ఆ భారం మొత్తం వినియోగదారులపైనే పడుతుంది. కేంద్ర ప్రభు త్వం వెంటనే పన్నును రద్దుచేసి, చేనేత కార్మికులకు తోడ్పాటు ను అందించాలి.
-కోటగిరి అశోక్, చేనేత వినియోగదారుడు
జీఎస్టీని రద్దుచేయాలి
వస్ర్తాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే రద్దుచేయాలి. 5 శాతం ఉన్న జీఎస్టీని 7 శాతం పెంచడంతో అన్ని వస్ర్తాలపై ఆ ప్రభావం పడనుంది. వస్త్ర వ్యాపారం ద్వారా వేలాది కార్మికులకు ఉపాధిని అందించే తరుణంలో కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం వస్త్రపరిశ్రమను సంక్షోభంలోకి నెట్టడమే అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ ఉద్యోగాలు భర్తీచేయకపోగా, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తున్న వస్త్రరంగంపై కేంద్రం పన్నుపోటు వేయడం బాధగా ఉంది.
-నరేశ్, రెడిమేడ్ దుకాణ వ్యాపారి