ఆదిలాబాద్, నవంబరు 30 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వడ్లను కొనుగోలు చేయబోమని కేంద్ర సర్కారు తెగేసి చెప్పింది. పంటను ఎలా అమ్మాలో తెలియక ఆందోళనలో పడ్డ రైతాంగానికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. వానకాలం వడ్లను గ్రామాల్లోనే కాంటాను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్లో 5.10 లక్షల క్వింటాళ్ల పంట విక్రయానికి వస్తుందని అంచనా వేసిన అధికార యంత్రాంగం, అందుకను గుణంగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 412 కేంద్రాలను ప్రారంభించి, 48 వేల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసింది. గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేస్తుండడంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. రైతుబంధు, ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు లాంటి పథకాల ద్వారా జిల్లా వ్యాప్తంగా రెండు సీజన్లలో వరిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది వానకాలంలో 2,80,853 ఎకరాల్లో వరి సాగు చేశారు. నిర్మల్ జిల్లాలో 1,15,000 ఎకరాలు, కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలో 51,623 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1,14,230 ఎకరాలు పంటను రైతులు సాగు చేశారు. వానకాలంలో వర్షాలు బాగా పడడం, వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 2.30 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్ జిల్లాలో 1.88 మెట్రిక్ టన్నులు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 92 వేల మెట్రిక్ టన్ను పంట మార్కెట్కు రానుందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.10 లక్షల మెట్రిక్ టన్నుల పంట విక్రయానికి రానుండగా, రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
48 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి వడ్లను కొననున్నారు. ఐకేపీ సంఘాలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల ద్వారా గ్రామాల్లో కాంటాలు పెట్టి మద్దతు ధరతో వడ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 48 వేల మెట్రిక్ టన్నుల పంటలు ప్రభుత్వం సేకరించింది. ఆదిలాబాద్ జిల్లాలో 3, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 29, నిర్మల్ జిల్లాలో 152, మంచిర్యాల జిల్లాలో 228 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో 24,24,239 మెట్రిక్ టన్నులు, ఆదిలాబాద్ జిల్లాలో 2 వేల క్వింటాళ్లు, నిర్మల్ జిల్లాలో 42 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధాన్యానికి క్వింటాల్ మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రూ.1960, బీ గ్రేడ్కు రూ.1940 ప్రకటించింది. జిల్లాలో ఏ గ్రేడ్ ధాన్యం అమ్మకానికి వస్తున్నది. దీంతో రైతులకు మొదటి రకం వడ్ల ధర లభించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం గా వానకాలంలో రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు సాగు చేస్తున్నాడనే వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. వీటి ఆధారంగా వరి సాగు చేసిన రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు కరోనా నిబంధనలు పాటిస్తారు.
వరి కొనుగోళ్లకు రంగం సిద్ధం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరికోతలు ప్రారంభమవుతుండగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వెంటవెంటనే ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 29 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యేడాది జిల్లాలో 51,623 ఎకరాల్లో వరి సాగుచేశారు. అధికారులు వేసిన అంచనాల ప్రకారం 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో వరి ఎక్కువగా పండించే కాగజ్నగర్ డివిజన్లో రైతులకు అందుబాటులో ఉండేలా ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొనుగోళ్ల సమయంలో ఏవైన సమస్యలు ఎదురైతే ప్రత్యేకం గా 18005991200 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు.జిల్లాలోని కాగజ్నగర్, దహెగాం, పెంచికల్పేట్, చింతలమానేపల్లి, కౌటాల, రెబ్బెన, సిర్పూర్-టి మండలాల్లో వరి ఎక్కువగా పండిస్తారు. జిల్లాలో 29 కొనుగోలు కేంద్రాలను సహకార సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చే రైతులు ధాన్యంలో 17 కంటే తక్కువ తేమ శాతం ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పట్టా పాస్పుస్తకాలు, బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు జిరాక్సులు వెంట తెచ్చుకోవాలని కోరుతున్నారు.
దళారుల నుంచి విముక్తి కలిగింది
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి రైతులకు దళారుల నుంచి విముక్తి కలిగింది. గతంలో దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని చాలా నష్టపోయినం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మా కష్టానికి లాభం దక్కుతుంది. కొనుగోలు కేంద్రాలను ఇట్లనే ఉంచాలె.