కౌటాల, మార్చి 25 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నదీమాబాద్కు చెందిన ఆరుగురు స్నేహితులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. స్నానాలు చేసేందుకు మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలో గల వార్దా నదికి వెళ్లారు. నదిలోకి దిగగానే ఆరుగురు స్నేహితుల్లో నవీన్కు ఫోన్ రావడంతో మళ్లీ వస్తానని ఇంటికి వెళ్లాడు. మిగతా ఐదుగురు స్నేహితులు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. ఇందులో పనాస కమలాకర్(23), ఉప్పుల సంతోష్(22), ఎల్ములే ప్రవీణ్(23), ఆలం సాయి(20) స్నానం చేయడానికి నీటిలో దిగగా.. సంతోష్ వస్తువులు, బట్టల వద్ద కాపలా ఉన్నాడు. స్నానానికి నదిలోకి దిగిన స్నేహితులు ఈత రాకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీట మునిగారు. మొదటగా ప్రవీణ్ నదిలోకి దిగగా మునిగి పోతుండగా కమలాకర్ పట్టుకునే ప్రయత్నం చేశాడు.
కమలాకర్ కూడా కొట్టుకుపోతుండగా ఉప్పుల సంతోష్ కాపాడే ప్రయత్నం చేశాడు. ఆయన కూడా కొట్టుకుపోతుండగా సాయి కాపాడే ప్రయత్నం చేసి.. నలుగురు కూడా కొట్టుకుపోయారు. నలుగురు స్నేహితులు నీటిలో మునగడాన్ని గమనించిన సంతోష్ కాపాడండి.. కాపాడండి అని కేకలు వేశాడు. ఆ లోపే నలుగురు స్నేహితులు మునిగిపోయారు. అక్కడే ఉన్న వారు కేకలు విని వచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే ఘటనా స్థలంలోని వారు కౌటాల సీఐ సాదిక్పాషాకు సమాచారం అందించారు. తాటిపల్లి గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాల కోసం వెతికించారు. మూడు గంటలు వెతికి నలుగురి మృతదేహాలను బయటకు తీశారు.
నీట మునిగి మృతిచెందిన ఎల్ములే ప్రవీణ్, పనాసా కమలాకర్, ఉప్పుల సంతోష్, ఆలం సాయిల కుటుంబ సభ్యుల రోదనలతో ఊరంతా దద్దరిలింది. అప్పటి వరకు గ్రామంలో అందరితో సరదాగా హోలీ వేడుకల్లో పాల్గొన్న స్నేహితులు.. ఇలా విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. ఎల్ములే ప్రవీణ్కు యేడాది క్రితం వివాహమైంది. కుమారుడు ఉన్నాడు. ఉప్పుల సంతోష్ స్థానిక రైస్ మిల్లులో ఆపరేటర్గా, పనాసా కమలాకర్ డ్రైవర్గా, ఆలం సాయి ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. వీరికి పెండ్లిళ్లు కాలేదు.
విషయం తెలుసుకున్న ఎస్పీ సురేశ్కుమార్, డీఎస్పీ కరుణాకర్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కౌటాల సీఐ సాదీక్ పాషాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కౌటాల ఎస్సై మధూకర్, ఏఎస్సై దేవీసింగ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
దండేపల్లి/జన్నారం, మార్చి 25 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రశాంత్-అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భర్త ప్రశాంత్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. భార్య అశ్విని ఐదు రోజుల క్రితం పిల్లలను తీసుకుని మామిడిపెల్లికి వచ్చింది. ఇంటర్ చదివే కార్తిక్ తన స్నేహితులతో కలిసి ఉదయం 9 గంటలకు హోలి ఆడుకోవడానికి వెళ్లాడు.
వేడుకల అనంతరం స్నానం చేయడానికి తానిమడుగు డెలివరీ పాయింట్ వద్ద నీటిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి పోయాడు. గమనించిన అనిల్కుమార్, అరవింద్లు నీటి నుంచి బయటకు తీసేసరికి అపస్మారకస్థితోకి వెళ్లిపోయాడు. చికిత్స నిమిత్తం సమీపంలోని మేదరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి అశ్విని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వరూప్రాజ్ తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలోని జైజవాన్ నగర్కు చెందిన హర్షిత్(14) హోలీ వేడుకల్లో ఉత్సా హంగా పాల్గొన్నాడు. అనంతరం ఆదిలాబాద్ మండలంలోని భీంసరి వాగులో స్నానం చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే మృతదేహాన్ని వెలికి తీశారు.