పెద్దపల్లి (నమస్తే తెలంగాణ)/ మంచిర్యాల టౌన్, మార్చి 30 : బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన 36 గంటల రైతు నిరసన దీక్షకు మాజీ విప్ బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వంద రోజుల పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. రైతులు నీటి కోసం, కరెంటు కోసం రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లందక రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే ఈ సర్కారు ఏ మాత్రం చలించడం లేదని మండిపడ్డారు.
సాగు నీరందక ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. మాజీ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనలో ఎక్కడా ఒక్క ఎకరం కూడా ఎండనివ్వలేదని, రైతులకు మేలు కలిగేలా సాగు నీటి కోసం ప్రాజెక్టులను నిర్మించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో కరువు పరిస్థితులు వచ్చాయని, సాగునీరందక రైతులు రోడ్డెక్కుతున్నప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయారన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రివా.. లేక రాక్షసుడివా.. ఓట్లేసిన ప్రజల పేగులు మెడలో వేసుకుంటావా..? అని ప్రశ్నించారు.
ఇలాంటి కాంగ్రెస్ను పార్లమెంటు ఎన్నికల్లో పాతరేయాలని, ఒక్కసీటు కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల జీవితాలను ఆగం చేస్తున్నదని, పంటలకు నీళ్లివ్వాలన్న ఆలోచన లేకుండా బీఆర్ఎస్పై బురదజల్లడమే పనిగా పెట్టుకుందని, ఇచ్చిన హామీలనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. సీనియర్ నాయకుడు గోగుల రవీందర్రెడ్డి, నాయకులు ఉన్నారు.
ఎండుతున్న పంటలను కాపాడి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ’36 గంటల రైతు నిరసన దీక్ష’కు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కర్షకలోకం కదిలి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినదించారు. కొంత మంది రైతులు తమ పొలాల్లో ఎండిన వరిని తీసుకొచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే దిగి వచ్చి రైతులను ఆదుకోవాలని, రైతును కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కార్ తక్షణమే గద్దె దిగాలని ముక్తకంఠంతో నినదించారు. కాగా, దీక్షలో అనేక సార్లు విద్యుత్కు అంతరాయం ఏర్పడింది.