తహసీల్ కార్యాలయంలో సోదాలు
అర్ధరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు
ఏసీబీ డీఎస్పీ, ఆరుగురు సీఐల ఆధ్వర్యంలో విచారణ
ఖానాపూర్ టౌన్, జూలై 30 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పట్టా మ్యుటేషన్ కోసం సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయగా, బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఏసీబీ డీఎస్పీ భద్రయ్యతో పాటు ఆరుగురు సీఐలు, సిబ్బంది కార్యాలయానికి చేరుకొని విచారణ చేపట్టారు. అర్ధరాత్రి వరకు రికార్డులను పరిశీలించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఖానాపూర్ మండలంలోని బిర్నంది పంచాయతీ కొమ్ముతండాకు చెందిన గుగ్లావత్ గోవింద్ తన పేరిట ఉన్న 30 గుంటల భూమిని కుమారుల పేరిట గిఫ్ట్డీడ్ చేశాడు. దాని మ్యుటేషన్ కోసం గోవింద్, అతడి కుమారులు తహసీల్ కార్యాలయానికి వెళ్లగా, అక్కడి అధికారులు డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో గోవింద్ అతడి అల్లుడు మోహన్కు విషయాన్ని చెప్పాడు. ఈనెల 20న తహసీల్ కార్యాలయానికి వెళ్లిన మోహన్, తహసీల్దార్ నరేందర్ను సంప్రదించగా, వీఆర్ఏ అభిషేక్కు రూ. 7 వేలు ఇవ్వాలని చెప్పారు. దీంతో మోహన్ గూగుల్ పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత మరికొన్ని డబ్బులు కావాలని తహసీల్దార్ డిమాండ్ చేయగా, ఏసీబీని సంప్రదించాడు. దీంతో తహసీల్ కార్యాలయంలో అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, ఆరుగురు సీఐలు, మరికొంత మంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. కార్యాలయంపై మరికొన్ని ఫిర్యాదులు కూడా అందినట్లు, దీంతో పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నట్లు సమాచారం. రికార్డులు, లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. సిబ్బంది నుంచి కూడా పలు వివరాలు ఆరాతీశారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు సంజీవ్, రవీందర్, రాము, సునీల్, జానారెడ్డి సిబ్బంది ఉన్నారు.
కేసు నమోదు చేయాలి
దండేపల్లి, జూలై 30 : బీజేపీ నేత ఈటల రాజేందర్ బం ధువు మధుసూదన్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దండేపల్లి మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యం లో శుక్రవారం ఎస్ఐ శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. ఈటల రాజేందర్, అతని బంధువు దళిత ద్రోహులని, వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు ఎల్ బాపు, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోళ్ల రాజమల్లు, మాల మహానాడు మండలాధ్యక్షుడు మాడ దయాకర్, నాయకులు జాడి రమేశ్, జాడి ఇసాకర్, మగ్గిడి శ్రీనివాస్, సత్తయ్య, సుదర్శన్ గంగయ్య, రవి, రాజయ్య, రాజనర్సు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.