పత్తి కాయలను తినేస్తున్న గులాబీ రంగు పురుగు
రెండేండ్లుగా ఇదే పరిస్థితి
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
నెన్నెల, డిసెంబర్ 26 : తెల్లబంగారంపై గులాబీ పురుగు దాడి చేస్తున్నది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. పంట ఏపుగా పెరుగుతున్నా గులాబీ పురుగు ఉధృతితో తీవ్రంగా నష్టపోతున్నామని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నది. మంచిర్యాల జిల్లాలో దాదాపు 30 వేల కు పైగా ఎకరాల్లో పత్తి పంట వేశారు. ఇందు లో 20 వేల ఎకరాల్లో గులాబీ పురుగు ప్రభా వం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో అనుకున్నంత దిగుబడి రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎకరానికి పది క్విం టాళ్ల పత్తి దిగుబడి వస్తుందనుకున్న రైతులకు కనీసం మూడు క్వింటాళ్లు కూడా రావడంలేదు. పత్తి పంటపై మొదటి నుంచే పురుగు దాడి చేయడంతో కాయలన్నీ కుళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో అనుకున్నంత పింజ రావడంలేదు. కాయలోని గింజలను పురుగు తినేయడం, కాయలోపల పురుగు విసర్జన తప్పా పింజ ఉండడం లేదు. పత్తికి అధిక ధర ఉన్నప్పటికీ దిగుబడి ఎక్కువ లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పత్తిని నమ్ముకొని రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. తీరా దిగుబడి రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోనిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
రెండేండ్లుగా ఇదే పరిస్థితి..
గులాబీ పురుగు ఉధృతి రెండు సంవత్సరాలుగా పెరుగుతూనే వస్తున్నది. గతేడాది చివరి దశలో ఉన్నకాయలకు గులాబీ పురుగు అశిం చి పంటను తీవ్రంగా దెబ్బతీసింది. అంతకుముందు అక్కడక్కడా ఉధృతి కనబడింది. ఆ ప్రభావంపై పట్టించుకోలేదు. కానీ ఇప్పుడది ఉగ్రరూపం దాల్చింది. వేలాది మంది రైతులు మేలు రకాలైన విత్తనాలనే ఎన్నుకొని సాగు చేశారు. అ యినా పురుగు బాధ తప్పలేదు. నెన్నెల, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, బెల్లంపల్లి, మందమర్రి, కాసిపేట మండలాల్లో పురుగు ఉధృతి ఉంది. దీంతో వచ్చిన పంటకు కూడా పూర్తి స్థాయిలో అనుకున్న ధర రావడంలేదని రైతు లు అంటున్నారు.