ఎవరెస్టును అధిరోహించిన బాదనకుర్తి వాసి
ఖానాపూర్రూరల్, డిసెంబర్ 29 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామానికి చెందిన శనిగారపు గంగారెడ్డి (24) ఈ నెల 27వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. తమ సహచరులతో కలిసి ఎవరెస్టు ఉపరితలంపై జాతీయ జెండా ఎగురవేశారు. భారతదేశంలో ఎత్తయిన శిఖరమైన ఎవరెస్టు (8848 మీటర్లు) ఎక్కాడు.
నిర్మల్ నుంచే అడుగులు..
శనిగారపు గంగారెడ్డి విద్యాభ్యాసం నిర్మల్ జిల్లాలోని చాణక్య పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సాగింది. ఇంటర్ 2014-16 వరకు నిర్మల్లోని దీక్ష కళాశాలలో కొనసాగించాడు. ఈ సమయంలోనే ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్లో 2016 మే లో రన్నింగ్, ఈవెంట్లలో ఉత్తీర్ణుడయ్యాడు. జూన్లో నిర్వహించిన పరీక్షలో ర్యాంక్ పొంది ఉద్యోగాన్ని సాధించాడు. మొదటిసారి బెంగళూర్లో క్రాప్సాబ్ మిలిటరీలో 20 నెలలు ప్రత్యేక శిక్షణ పొందాడు. నాగాలాండ్లో మూడేండ్లు క్రాప్సాబ్ మిలిటరీలో సైనికుడిగా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాల జిల్లాలో పని చేస్తున్నాడు. అక్కడి అధికారుల ఆదేశాల మేరకు అనుమతులు పొంది ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకున్నాడు. ఈ నెల 27వ తేదీన తన సహచరులతో కలిసి 9800 మీటర్లను హిమాచల్ ప్రదేశ్లోని స్టార్ హిల్స్ ప్రాంతం నుంచి ఎక్కడం మొదలు పెట్టగా, ఎక్కడం పూర్తవడానికి ఆరు గంటలు పట్టింది. ఎవరెస్టు అధిరోహన అనంతరం తమ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు, తోటి ఉద్యోగులకు సమాచారం అందించాడు. తిరిగి దిగడానికి నాలుగు గంటలు సమయం తీసుకున్నాడు. గంగారెడ్డిని క్రాప్సాబ్ మిలిటరీ ఉద్యోగులు అభినందించి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు శనిగారపు భూమవ్వ, రాజలింగం, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.