అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం
ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఎదులాపురం, డిసెంబర్ 29 : ఆదిలాబాద్ను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో బుధవారం వార్షిక క్రైమ్ రిపోర్ట్ను వివరించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తక్కువ సంఖ్యలో నమోదైనట్లు చెప్పారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 73 శాతం పెరిగాయని, గుట్కా కేసులు తగ్గాయని వెల్లడించారు. జనవరి 2 వరకు కొవిడ్ ఆంక్షలు అమలులో ఉంటాయని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేస్తామని చెప్పారు.
పోలీసు అధికారులతో సమావేశం..
స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైందన్నారు. వర్టికల్స్ను అర్థం చేసుకుంటే పని సులువుగా పూర్తి చేయవచ్చన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చేలా ప్రజలకు అవగాహన, ప్రోత్సాహం కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, పట్టణ డీఎస్పీలు వెంకటేశ్వరరావు, విజయ్కుమార్, ఆర్ఐలు వేణు, వెంకటి, శ్రీపాల్, వంశీకృష్ణ, పట్టణ సీఐలు పోతారం శ్రీనివాస్, రామకృష్ణ, పురుషోత్తంచారి, ఎస్బీ సీఐ కృష్ణమూర్తి, ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, ఐటీ కోర్ ఫింగర్ ప్రింట్, డీసీఆర్బీ అధికారులు సీసీ దుర్గం శ్రీనివాస్, ఆదిలాబాద్, ఉట్నూర్ సబ్ డివిజన్ల ఎస్ఐలు పాల్గొన్నారు.
గుండాల గ్రామంలో సందర్శన..
ఇచ్చోడ, డిసెంబర్ 29 : ఇచ్చోడ, సిరికొండ పోలీసులు, సాయుధ బలగాలతో కలసి గుండాల గ్రామాన్ని ఎస్పీ సందర్శించారు. గ్రామంలో జంట హత్య కేసుల్లో మరణించిన, గాయపడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఘర్షణకు సంబంధించిన వివరాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు నిరాకరించిందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు నివేదికలను పంపించామని తెలిపారు.