స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచిర్యాల మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో ఏడోస్థానం
సౌత్ జోన్ స్థాయిలో 25వ ర్యాంకు
మంచిర్యాలటౌన్, నవంబర్ 29 : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతే లక్ష్యంగా అమలు చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచిర్యాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో ఏడో స్థానం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని 30 మున్సిపాలిటీలు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొనగా, అందులో ఆయా విభాగాల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల మున్సిపాలిటీకి ఏడో స్థానం లభించింది. సౌత్జోన్ స్థాయిలో 198 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొనగా, అందులో మంచిర్యాల మున్సిపాలిటీ 25వ ర్యాంకు సాధించింది. గతేడాది సౌత్జోన్ పరిధిలో 164వ స్థానం లభించింది. పట్టణాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత, మెరుగైన సేవలు, ప్రజలకు అవగాహన, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, తడిపొడి చెత్త వేరు చేయడం, బహిరంగ మల మూత్ర విసర్జన నిర్మూలన, ప్లాస్టిక్ నిషేధంవంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించినందుకుగానూ స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో మెరుగైన ర్యాంకు వరించింది.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..
మంచిర్యాల పట్టణంలో బల్దియా సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 88వేల జనాభా ఉండగా, 2021 వరకు ఆ సంఖ్య లక్షకు చేరువైనట్లు తెలుస్తోంది. మొత్తం 36 వార్డులు ఉండగా, నిత్యం 44 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. చెత్తను ఇంటింటికీ వెళ్లి సేకరించడం, సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తలుగా వేరు చేసి డంప్యార్డులో ఎరువుగా మార్చడం, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంవంటి పనులు నిత్యం జరుగుతున్నాయి. ప్రజల సౌకర్యార్థం పట్టణంలో 16 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. ఇక చెత్తను తరలించడానికి 15 ట్రాక్టర్లు, 54 ఆటో ట్రాలీలను ఉపయోగిస్తున్నారు. 70 మంది శాశ్వత పారిశుధ్య కార్మికులు, 275 మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇక ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో పలు అంశాల వారీగా కేంద్ర బృందం సభ్యులు వచ్చి పరిశీలన జరిపారు. ఆ సమయంలో వారు సంబంధిత అంశాలకు పాయింట్లు కేటాయించారు. మొత్తం ఆరువేల పాయింట్లకుగాను 2580 పాయింట్లు సాధించింది. ఇందులో ప్రజలనుంచి ఫీడ్బ్యాక్ విషయంలో 1800 పాయింట్లకు 1040, సర్టిఫికేషన్పై 1800 పాయింట్లకుగాను 300 పాయింట్లు, తడి, పొడి చెత్త సేకరణ, ఎరువుల తయారీ, ఇతర అంశాలకు 2400 పాయింట్లకు 1240 పాయింట్లు లభించాయి.