ఎకరానికి 57 చొప్పున 456 మొక్కలు
800 శ్రీగంధం, 300 టేకు, 150 వెదురు, 30 మామిడి మొక్కలు సైతం నాటి సంరక్షణ
అంతర పంటలుగా కంది, మిరప, వేరు శనగ, వరి
పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్ర
మిగతా రైతులకు ఆదర్శం
కోటపల్లి, నవంబర్ 29 : కోటపల్లి మండల కేంద్రానికి చెందిన ఎంపీపీ మంత్రి సురేఖ-రామయ్య దంపతులు తమకున్న ఎనిమిది ఎకరాల్లో పామాయిల్ తదితర పంటలు సాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పామాయిల్ సాగుకు ప్రాధాన్యమివ్వడం, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రోత్సహించడంతో ఏడాది క్రితం తమకున్న ఎనిమిది ఎకరాల్లో.. ఎకరానికి 57 చొప్పున మొత్తం 456 పామాయిల్ మొక్కలు నాటారు. ఈ చెట్ల మధ్యన 800 శ్రీగంధం, పొలం చుట్టూ 300 టేకు, 150 వెదురు, 30 మామిడి మొక్కలు నాటారు. పామాయిల్ సాగుకు ఇక్కడి వాతావారణం అనుకూలంగా ఉండడం, సంబంధిత అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. శ్రీగంధం సుదీర్ఘకాల పంట కాగా, ఈ పంట ఫలాలు 25 ఏళ్ల తర్వాత చేతికి అందనున్నాయని ఎంపీపీ వివరిస్తున్నారు. పామాయిల్లో అంతర పంటలుగా మిరప, కంది, వేరుశనగ సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వీటితో పాటు ఇంటి అవసరాల కోసం అర ఎకరంలో వరి పండిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు. ఇక ఎనిమిది ఎకరాల చుట్టూ నాటిన టేకు, వెదురు, మామిడి చెట్లు కంచెలా ఉపయోగపడుతున్నాయి. ఓ వైపు ఈ పంటల ద్వారా ఆదాయం పొందడమేగాకుండా.. ప్రభుత్వ ఆశయమైన హరిత తెలంగాణ సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ పంటలతో అధిక లాభాలు
రైతులు కేవలం వరి పంటకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. పంట మార్పిడి వల్ల భూమి కూడా సారవంతంగా ఉంటుంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దూరదృష్టితో ఆలోచించి మన ప్రాంతానికి ముందుగానే పామాయిల్ పంటను పరిచయం చేశారు. ఇప్పుడు చాలా మంది రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. పామాయిల్ పంట ఐదేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు పుష్కలంగా ఆదాయం ఇస్తుంది. వీటికి తోడు మార్కెట్లో డిమాండ్ ఉన్న కంది, పప్పు దినుసులను సాగు చేయడం వల్ల రైతులకు మంచి లాభం ఉంటుంది. మేము ఎనిమిది ఎకరాల్లో పామాయిల్తో పాటు శ్రీగంధం, టేకు, వెదురు, మామిడి చెట్లు నాటాం. భవిష్యత్తులో వీటి ద్వారా మంచి ఆదాయం వస్తుంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారమవుతాం.