రూ. కోటి వరకు వసూలు
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు
పోలీసుల అదుపులో మహిళ, ఆమె భర్త
నిర్మల్ టౌన్, నవంబర్ 29 : నమ్మకంగా ఉంటూనే ఆమె నట్టేటా ముంచింది. చిట్ ఫండ్ కంపెనీ పేరిట రూ. కోటి వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు సదరు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ శ్రీనివాస్తో కలిసి సోమవారం వివరాలు వెల్లడించారు. నిర్మల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన సాయినేని భాగ్యలత భర్త వెంగల్రావు పట్టణంలోని ఓ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. వీరు 20 ఏళ్లుగా ఆదర్శనగర్లో నివాసం ఉంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పట్టణంలో చిట్ఫండ్ కంపెనీని పెడుతున్నామని భాగ్యలత పలువురిని నమ్మించింది. కంపెనీలో పెట్టుబడులు పెడితే త్వరగా లాభాలు వస్తాయని తెలిసిన వారి నుంచి డిపాజిట్లు సేకరించింది. ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి పెద్ద ఎత్తున దాదాపు రూ. కోటి వరకు డిపాజిట్లు సేకరించారు. గతేడాది నర్వాడే వెంకట్రావ్ అతని భార్య కరుణ నుంచి రూ. 34. 90లక్షలు, ధర్మాజిగారి హేమలత, నాగారావు నుంచి రూ. 48. 50లక్షలతో పాటు ఇలా మరికొందరి నుంచి డిపాజిట్లు తీసుకున్నారు. చిట్ఫండ్ కంపెనీ ప్రారంభించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు తమకు డిపాజిట్ డబ్బులు చెల్లించాలని భాగ్యలత, వెంకట్రావ్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు రూ. 14. 90 లక్షలకు చెక్కు ఇచ్చారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లగా బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆదర్శనగర్కాలనీకి చెందిన నీలగిరి నీలిమ, జ్యోతి నుంచి రూ. 50వేలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా జాప్యం చేయగా వారు కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో చెక్కు ఇస్తామని చెప్పి ఇంటికి వెళ్తుండగా భాగ్యలత, వెంకట్రావ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నామని డీఎస్పీ వెల్లడించారు. అనుమతి లేని చిట్టీల వ్యాపారానికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.