వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పూర్తిచేయాలి
రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలి
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
సారంగాపూర్, నవంబర్ 29 : వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. మండలంలోని సారంగాపూర్, స్వర్ణ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం పరిశీలించారు. అనంతరం సిరిపెల్లి-మహారాష్ట్ర సరిహద్దు వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు పాటించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. నాణ్యమైన పంటను వెంటనే కొనుగోలు చేసి, రిజిస్టర్లలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వరి ధాప్యం కొనుగోలు చేయకుండా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ వెంట ఎస్పీ ప్రవీణ్కుమార్, అదనపు కలెక్టర్ రాంబాబు, తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఎంపీడీవో సరోజ, ఏవో రాజశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు వేయాలి..
నిర్మల్ టౌన్, నవంబర్ 29 : జిల్లాలో రైతులు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయశాఖ రూపొందించిన యాసంగి వరికి బదులుగా ఇతర పంటలు సాగు పోస్టర్లను స్థానిక పట్టణ కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. యాసంగిలో వడ్లను కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ముందస్తుగా ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తున్నదన్నారు. ఆరుతడి పంటల్లో పొద్దు తిరుగుడు, వేరుశనగ, మక్క, కూరగాయల పంటలు, పప్పుదినుసుల పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
పోడు భూముల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలి..
పోడు భూముల పట్టాల కోసం రైతుల వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో ఇప్పటివరకు పోడు సాగు చేసుకుంటున్న రైతుల దరఖాస్తుల వివరాలు, ఆన్లైన్ నమోదు, పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వివరాలను ఆన్లైన్లో పొరపాట్లు లేకుండా పొందుపర్చాలని తెలిపారు. తప్పులు లేకుండా ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.