క్షౌరశాలలు, లాండ్రీషాపులు,దోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
నాయీ బ్రాహ్మణ, రజకుల హర్షం
నార్నూర్, నవంబర్ 29 : సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుండడంతో నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలో 19 మంది లబ్ధిపొందుతున్నారు. మీ-సేవ కేంద్రాల ద్వారా బీసీ కార్పొరేషన్ దరఖాస్తులు స్వీకరించడంతో పాటు అర్హులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 250యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నది.
40 కుటుంబాలు…
నార్నూర్, గాదిగూడ మండలాల్లో నాయీబ్రాహ్మణ, రజక కుటుంబాలు 40 ఉన్నాయి. వీరందరూ కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నాయీ బ్రాహ్మణులు సెలూన్లు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రస్తుతం 19 మందిలబ్ధిపొందారు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకం దోహదపడుతున్నది.
మరో అవకాశం..
నాయీ బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రెండు మండలాల్లో ఈ పథకానికి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మీ-సేవ కేంద్రాల ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తుదారులు తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, సెలూన్, లాండ్రీ షాపుల ఫొటోలతో పాటు ఆధార్కార్డు జత చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు సొంత కమర్షియల్ విద్యుత్ మీటర్ కలిగి ఉండాలి. లేని వారు దర ఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు ఉచితంగా బిగిస్తారు. కనెక్షన్ లబ్ధిదారుడి పేరిట ఉండాలనే నిబంధనలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ అద్దెషాపు అయితే ఆ లబ్ధిదారుడు ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్న రెంటర్ అగ్రిమెంట్, ధ్రువీకరణ పత్రాలు జతపరిచి సంబంధిత శాఖ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉచిత కరెంట్ ఇస్తున్నారు
గత జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలవుతున్నది. గతంలో మేము వేలాది రూపాయల కరెంట్ బిల్లులు చెల్లించాం. కొంతకాలంగా కరెంట్ బిల్లులు మాఫీ అవుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి బిల్లులు రావడం లేదు.
-రవి, లబ్ధిదారుడు, నార్నూర్