నిర్మల్ అర్బన్, మే 29 :కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటగానే వాహనాలు, వచ్చిపోయే వారిని తనిఖీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి.. రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిల భరతం పడుతున్నారు. కరోనా ప్రమాదం ఉందని హెచ్చరించినా పట్టించుకోని వారికి.., వైరస్ సోకినా ఏమీ కాదన్న అతి నమ్మకంతో ఉన్న వారికి ఫలితం ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శనివారం నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న వాహనదారులను, వాహనాలను, ఆకతాయిలను పోలీసులు పట్టుకున్నారు. ఆయా చోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. కౌన్సెలింగ్ ఇచ్చి, లాక్డౌన్ నిబంధనల కింద కేసులు నమోదు చేశారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు ఏర్పాట్లను ఓఎస్డీ హర్షవర్దన్ శ్రీవాత్సవ్తో కలిసి పర్యవేక్షించారు. కారణం లేకుండా బయట తిరుగుతున్న వారిని ప్రత్యేక వాహనంలో ఐసొలేషన్ సెంటర్లకు తరలించి, రిమ్స్ దవాఖాన వైద్యులతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. అకారణంగా రోడ్లపై తిరిగే ఆకతాయిలను స్పెషల్ డ్రైవ్ ద్వారా గుర్తించి, ఐసొలేషన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరించారు. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద అసొలేషన్ వాహనాలను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాస్రావు, వినోద్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, వీపూరి సురేశ్, సీఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు.
నిర్మల్ పట్టణంలో ఉదయం 10 గంటల తర్వాత సోన్ ఎస్ఐ జీవన్రెడ్డి తనిఖీ చేపట్టారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐసొలేషన్కు తరలిస్తామని హెచ్చరించారు.
దిలావర్పూర్, మే 29 : నిర్మల్-బైంసా జాతీయ రహదారిపై తిరుగుతున్న పలు వాహనాలను, వాటి యజమానులను దిలావర్పూర్ ఎస్ఐ సంజీవ్, తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారితో పాటు దిలావర్పూర్లో అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన పలువురికి స్థానిక పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. పట్టుబడిన వాహనాలు లాక్డౌన్ ముగిసే దాకా పోలీస్స్టేషన్లో ఉంటాయని తెలిపారు.
భైంసా, మే, 29 : పట్టణంలోని కుభీర్ చౌర స్తా, రాజీవ్నగర్, ఓవైసీ నగర్తో పాటు తదితర ఏరియాల్లో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వారికి వైద్య సిబ్బందితో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించి, పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్కు తరలించనున్నట్లు తెలిపారు. వాహనాలను స్వాధీ నం చేసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. ఎస్ఐ ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు.
దస్తురాబాద్, మే29 : దస్తురాబాద్తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. కారణం లేకుండా బయటకు వచ్చిన ఏడుగురికి పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. నెగెటివ్ రాగా, కౌన్సెలింగ్ ఇచ్చి లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది లక్ష్మణ్, శ్రావణ్, మధు, ఆనంద్, వైద్య సిబ్బంది రవి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.