రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
ఎదులాపురం/నిర్మల్ టౌన్, నవంబర్ 27 : అన్ని జిల్లాల్లో వానకాలం పంట వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వరి ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంట ప్రణాళిక తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో కొనుగోళ్లు చేసిన, తరలించిన వరి ధాన్యం, రైతు ఖాతాల్లో జమ చేసిన డబ్బుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుదిశగా రైతులు దృష్టిపెట్టేలా చూడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనబోమని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ మేరకు రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వానకాలం వరి ధాన్యాన్ని రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నందున వెంట వెంటనే తూకం వేసి గోదాములకు తరలించాలని ఆదేశించారు. పక్క ప్రాంతాల నుంచి ధాన్యం రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో 1200 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారని సీఎస్కు వివరించారు. సుమారు 26,400 క్వింటాళ్ల దిగుబడి రానున్నదని వెల్లడించారు. ఇప్పటి వరకు 277 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు చెప్పారు. అలాగే నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 142 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇన్చార్జి ఎస్పీలు రాజేశ్ చంద్ర, ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, మేమంత్ బోర్కడే, ఆదిలాబాద్ డీఎస్వో సుదర్శన్, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారీ, ఏడీ రమేశ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.