జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత
ఎదులాపురం, నవంబర్ 27: వాయిదాలతో న్యాయస్థానం చుట్టూ తిరిగే అవసరం లేదని, జాతీయలోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులకు పై కోర్టుకు వెళ్లి అప్పీలు చేసే ఆస్కారం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత అన్నారు. డిసెంబర్11న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయలోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఆదిలాబాద్ ఇన్చార్జీ ఎస్పీ, జడ్జిలు, అడిషనల్ పీపీలతో శనివారం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత మాట్లాడారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ద్వారా అరుదైన అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇరువర్గాలు శాంతి పూర్వకమైన వాతావరణంలో రాజీపడవచ్చన్నారు. న్యాయస్థానంలో చెల్లించిన కోర్టు రుసుము తిరిగి బాధితులకు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రాజీకి అనువైన కేసుల దర్యాప్తు వెంటనే పూర్తి చేసి తుది నివేదిక న్యాయస్థానంలో అందించాలని సూచించారు. జిల్లా అంతటా విస్తృత ప్రచారం చేసి కక్షిదారులు, బాధితులకు సమాచారం అందించాలని పోలీస్ శాఖను కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇరువర్గాల సమ్మతితో రాజ మార్గంలోనే కేసుల పరిష్కారం ఉంటుందన్నారు. కుటుంబ తగాదాలు, ఎక్సైజ్ కేసులు, పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, కోట్లాట కేసులు, రోడ్డు ప్రమాదాలు, ఇన్సూరెన్స్ తదితర కేసులు రాజీమార్గంలో పరిష్కరించడానికి చక్కటి వేదికను జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు. కేసు లు త్వరగా పరిష్కరించడానికి లోక్ అదాలత్ మంచి అవకాశమని ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసు కేసులో ఉన్న వారందరికీ సమాచారం అందిస్తామని, ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని కేసుల నుంచి విముక్తి పొందాలన్నారు. భారీస్థాయిలో కేసులు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పా రు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి డాక్టర్ టీ శ్రీనివాసరావు, మహిళా కోర్టు న్యాయమూర్తి వై జయప్రసాద్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాండే, సీనియర్ సివిల్ జడ్జి జీ ఉదయభాస్కర్, జూనియర్ సివిల్ జడ్జిలు మంజుల సూర్యవార్, యశ్వంత్ సింగ్ చౌహాన్, పీపీలు సం జయ్ వైరాగారే, మేకల మధుకర్, కిరణ్ కుమార్ రెడ్డి, కేమ శ్రీకాంత్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు కే పురుషోత్తమాచారి, ఎస్ రామకృష్ణ, కే మల్లేశ్, ట్రాఫిక్ సీఐ కే ఫణిధర్ పాల్గొన్నారు.