పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన ఇద్దరిపై కేసు
ఎదులాపురం/తాంసి, నవంబర్ 27 : తనిఖీల్లో భాగంగా బైక్ను ఆపినందుకు ఇద్దరు వ్యక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అందులో ఓ వ్యక్తి తమ బైక్కే నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంజాబ్చౌక్లో జరిగింది. పత్తి ధర పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేస్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ బాకీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అప్పుడే శాంతినగర్కు చెందిన షేక్ ఫరీద్ ద్విచక్రవాహనంపై వస్తుండగా ఆపారు. ఆ వాహనానికి సైడ్ నంబర్ లేదు. ధ్రువీకరణ పత్రాలు లేవు. పైగా యజమాని పేరు (మ్సైం మారుతి) తప్పుగా చెప్పాడు. మరోవైపు చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అనుమానాస్పదంగా ఉండడంతో విచారణ కోసం కాసేపు ఆగాలని ఫరీద్ను పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో వాహనదారుడు షేక్ ఫరీద్ తన మిత్రుడైన షేక్ మక్బూల్కు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. వీరిద్దరు పోలీసు విధులకు ఆటంకం కలిగించడమేకాకుండా వారితో వాగ్వావాదానికి దిగారు. తద్వారా ట్రాఫిక్ ఎస్ఐ బాకీ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ధ్రువీకరణపత్రాలు చూపించి తీసుకెళ్లాలని తెలుపగా, సహనం కోల్పోయిన ఫరీద్ మిత్రుడు షేక్ మక్బూల్ ద్విచక్రవాహనానికి నిప్పటించాడు. వెంటనే మంటలు వ్యాపించడంతో జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి బకెట్లలో నీరుతెచ్చి మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షేక్ ఫరీద్, షేక్, మక్బూల్లపై వన్టౌన్ ఎస్ఐ జీ అప్పారావు కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ కే ఫణిధర్ తెలిపారు.