మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
కలెక్టరేట్లో కలెక్టర్, జడ్పీ కార్యాలయంలో చైర్ పర్సన్ ఘన నివాళి
హాజీపూర్, సెప్టెంబర్ 27 : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ముద్దు బిడ్డ అని, స్వాతంత్రోద్యమంతో పాటు రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేశారని, రాష్ట్ర సాధనే ఆశయంగా ముందుకు సాగారన్నారు. ఈ మహనీయుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసి కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు తెలిసేలా పాఠ్యాంశాల్లో జీవితచరిత్రను పొందుపర్చాలన్నారు. ఆశయ సాధన కోసం కష్టపడే తత్వాన్ని చూపారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్య్రం కోసం పోరాడారని కొనియాడారు. 1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే వారి తరపున వాదించి, కేసులను గెలిచారన్నారు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారన్నారు. 1969, 2009-12లో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి సురే శ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఖాజా నజీం అప్సర్ అలీ, దళిత అభివృద్ధి అధికారితో పాటు సంబంధిత అధికారులు, పద్మశాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
జడ్పీ కార్యాలయంలో..
జడ్పీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కాకరాల నరేందర్, కార్యాలయ సూపరింటెండెంట్లు బాలకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్తో పాటు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలీ సంఘం ఆధ్వర్వంలో..
స్థానిక బైపాస్ రోడ్డులోని వైశ్యభవన్ చౌరస్తాలో జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్వంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ సాధన సమితి నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు బండి మల్లి కార్జున్, నల్ల నాగేంద్రప్రపాద్, వాసు, చింతకింది తిరుపతి, పద్మశాలీ సంఘం నాయకులు సుధాకర్, శ్రీధర్, దేవేందర్, బొట్ల సత్యం, సత్తయ్య, తిరుపతి, నీలి శ్రీనివాస్, చంద్రమౌళి, కుందారపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్ మండలంలో..
హాజీపూర్ మండలంలోని పంచాయతీ కార్యాలయాల్లో జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు మాట్లాడారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.