ఎదులాపురం, సెప్టెంబర్ 27 : రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తున్నదని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలావరకు రోడ్డు ప్రమాదాల స్థలాలను పరిశీలించగా, నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తున్నదన్నారు. ఈ యేడు ఇప్పటి వరకు 110 ప్రమాదాల్లో 87 మంది మృత్యువాత పడ్డారని, 134 మందికి గాయలైనట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యేక కమిటీతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఐరాడ్ అప్లికేషన్ యాప్లో నిక్షిప్తం చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకపోవడం, ఫోన్లో మాట్లాడడం ,అతివేగం, మద్యం తాగి నడుపుతూ ఇతరుల ప్రాణాలను హరిస్తున్నట్లు పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల కేంద్రాల్లో రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే స్వాధీనం చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తప్పు చేసిన వారిపైనే కేసు నమోదు చేయాలని సూచించారు.
పోలీస్ కుటుంబాలకు వైద్య పరీక్షలు
పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లాకేంద్రంలోని హెడ్క్వార్టర్లో సికింద్రాబాద్ యశోద కార్పొరేట్ దవాఖాన ప్రత్యేక వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గైనకాలజిస్ట్ జ్యోతితో కలిసి ప్రారంభించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మూడు రోజుల పాటు పోలీసులు, వారి కుటంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. 176 మంది పోలీస్ కుటుంబ సభ్యులు వైద్యపరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్పీఎస్ కమాండెంట్ ఆర్ వేణుగోపాల్ డిప్యూటీ కమాండెంట్ ఎం.జయరాజు, శిక్షణ కేంద్రం అదనపు ఎస్పీ సమయ్ జాన్ రావు, రిజర్వ్ సీఐ సుధాకర్రావు, గడి కొప్పుల వేణు, శ్రీపాల్ , అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు సయ్యద్ తాజొద్దీన్, యశోదా ఆసుప్రతి వైద్యులు గజేంద్ర, మణికంఠ, ఎడ్వర్డ్, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
రివార్డులు అందజేత
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జల దిగ్బంధం చిక్కుకుపోయిన గ్రామాల్లో ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు, సహాయం అందించిన నార్నూర్ సీఐ కే ప్రేమ్ కుమార్, ఎస్ఐ డీ రమేశ్ను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. నగదు రివార్డులు అందజేశారు. వాగులో చిక్కుకున్న ఐదుగురు గొర్రెల కాపరులను కాపాడిన సిరికొండ ఎస్ఐ బీ కృష్ణ కుమార్, ఏఎస్ఐ ఎస్. బాలాజీ, కానిస్టేబుళ్లు ప్రకాశ్, సుధాకర్, ప్రకాశ్, హర్షత్, పాషాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నగదు రివార్డులను అందజేశారు.